సీఎం కోసం ట్రాఫిక్ ఆపారు.. వర్షంలో తడిసినందుకు జనం పోలీసులను తిట్టారు (వీడియో)
Recommended Video
హైదరాబాద్ : సిటీ ట్రాఫిక్లో అడుగు తీసి అడుగు వేయడం గగనమవుతుంది. రెడ్ సిగ్నల్ పడిందో.. అంతే సంగతి. వందల సంఖ్యలో వాహనాలు అలా ఆగిపోతాయి. ఇక గ్రీన్ సిగ్నల్ పడేంతవరకు వాహనదారులకు చికాకే. ఏరియాను బట్టి రెండు మూడు నిమిషాల వరకు గ్రీన్ సిగ్నల్ వెలగదు. ఆ క్రమంలో వాహనదారుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు.
ఇక ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్తో జనాల అవస్థలు వర్ణనాతీతం. వారు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ కష్టాలు చెప్పనక్కర్లేదు. అయితే సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం చాలాసేపు ట్రాఫిక్ను ఆపివేశారనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారడం చర్చానీయాంశంగా మారింది.
మామూలుగానే ట్రాఫిక్ కష్టాలు.. ఇక సీఎం కాన్వాయ్ కోసం వర్షంలో ఆపితే..!
హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మామూలు రోజుల్లోనే 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే చుక్కలు కనిపించే పరిస్థితి. అలాంటిది వర్షం పడితే అంతే సంగతి. సాధారణ రోజుల్లో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంట వరకు సమయం తీసుకుంటే.. వర్షం పడే సమయంలో రెండు, మూడు గంటలు పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా ట్రాఫిక్ కష్టాలు నగరవాసులకు సుపరిచితమే.
అసలే వర్షం పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ.. సీఎం కేసీఆర్ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడం జనాలకు కోపం తెప్పించింది. వర్షంలో తడిసి ముద్దవుతుంటే ఆయనకు దారి ఇవ్వడానికి మమ్మల్ని ఇబ్బందులు పెడతారా అంటూ పోలీసులను నిలదీశారు. దాంతో రెండు నిమిషాలు ఓపిక పట్టండంటూ ట్రాఫిక్ పోలీస్ చెప్పినా.. దాదాపు అరగంట వరకు ట్రాఫిక్ ఆపారని మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఆ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
జగన్ అలా.. కేసీఆర్ ఇలా.. ప్రతిపక్షంపై చెరో దారి..!
అంబులెన్స్కు దారి ఇచ్చిన జగన్.. నెటిజన్ల ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన రెండు మూడు రోజులకే ఆయన తన కాన్వాయ్ను ఆపి అంబులెన్స్కు దారి ఇచ్చిన ఘటన కు నెటిజన్లు తెగ ముగ్ధులయ్యారు. యువ సీఎం నిర్ణయం భేష్ అంటూ కితాబిచ్చారు. ఇఫ్తార్ సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన విందుకు హాజరై తిరిగి వెళుతున్న సందర్భంలో ఆ ఘటన జరిగింది. ఖైరతాబాద్ వైపు వెళుతున్న అంబులెన్స్ను ఆపి.. జగన్ కాన్వాయ్కు దారి ఇవ్వాలని పోలీసులు ప్రయత్నించడంతో ఆయన వద్దని సూచించారు.
అంబులెన్స్ వెళ్లిపోయాకే ఆయన తన కాన్వాయ్ను ముందుకుపోనిచ్చారు. జగన్ కాన్వాయ్లో దాదాపు పదికి పైగా వాహనాలున్నాయి. ఒకవేళ జగన్ కాన్వాయ్ను ముందు పంపించి ఉంటే.. అంబులెన్స్లో ఉన్న పేషెంట్కు వైద్యం అందడంలో కాస్తా ఆలస్యమై ఉండేది. ఆ క్రమంలో ఒకవేళ జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. అందుకే ఆ సందర్భంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిసింది. అదలావుంటే తన పర్యటనలతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఏపీ అధికారులకు జగన్ సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రాఫిక్ ఇబ్బందులతో.. సారీ చెప్పిన కర్ణాటక డిప్యూటీ సీఎం
కాన్వాయ్లతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వస్తే.. వాటిని గుర్తించే నేతలు చాలా తక్కువనే చెప్పాలి. రయ్ రయ్మంటూ రోడ్లపై దూసుకెళ్లడమే తప్ప తమ వల్ల ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారోననే విషయం మాత్రం పట్టించుకోరు. ఆ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర తనవల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో క్షమాపణలు చెప్పిన సందర్భముంది. ఓ కార్యక్రమానికి వెళుతున్నప్పుడు తన కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో స్కూళ్లకు వెళ్లే పిల్లలు ఇబ్బందులు పడ్డారు. ఆ సందర్భంగా ఆయన క్షమాపణలు చెప్పడం ఆదర్శప్రాయంగా నిలిచింది.
ట్రాఫిక్ పోలీసులకు క్లియర్గా చెప్పాను. నా కాన్వాయ్ వెళ్లే క్రమంలో స్కూల్ బస్సులు, అంబులెన్సులు ఆపొద్దని సూచించాను. అయినప్పటికీ ఇలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. నావల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు.. అందుకే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు అంటూ ఆయన చెప్పిన తీరు అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది.