హైదరాబాద్ లో రాహుల్ గాంధీ ప్రచారం.. ట్రాఫిక్ ఆంక్షలు
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈసారి హైదరాబాద్ ప్రచారానికే పరిమితమయ్యారు. సోమవారం రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సాయత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకు ఈ ఆంక్షలు అమలవుతాయి.
మొదటగా బేగంపేట విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరి వెళ్లి జూబ్లిహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొంటారు. అందులోభాగంగా సాయంత్రం 4 గంటల నుంచి ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అరగంట పాటు కొనసాగుతాయి. విమానాశ్రయం నుంచి బేగంపేట ఫ్లైఓవర్, శ్రీనగర్ కాలనీ జంక్షన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయి.
జూబ్లిహిల్స్ సెగ్మెంట్ లోని వెంకటగిరి, కృష్ణానగర్, యూసుఫ్ గూడ చెక్ పోస్ట్, శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రాహుల్. అక్కడినుంచి నేరుగా రోడ్డుమార్గం ద్వారా కూకట్ పల్లి చేరుకుంటారు. అక్కడ ప్రచారం పూర్తి చేసుకుని ఫతేనగర్ ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇదే రాహుల్ చివరి పర్యటన. భారీ జనసమీకరణతో రాహుల్ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు శ్రమిస్తున్నారు.