వర్ష బీభత్సంతో విషాదం: వరదలో 30మంది గల్లంతు .. పాతబస్తీలో 9 మంది మృతి
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగానూ ,హైదరాబాద్ నగరంలోనూ గత 24 గంటలుగా కురుస్తున్న భారీవర్షం విషాదాన్ని మిగిల్చింది .విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పాతబస్తీలో వర్ష బీభత్సం వల్ల 9మంది మృతి చెందిన విషాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు 30మంది గల్లంతు కాగా , 30 వాహనాలు కొట్టుకుపోయాయి .
Recommended Video
హైదరాబాద్లో భారీ వర్షం .. నోళ్ళు తెరిచిన మ్యాన్ హాల్స్ .. జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ
ఇళ్ళపై బండరాళ్ళు పడి 9 మంది మృతి , నలుగురికి తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు చాంద్రాయణగుట్టలోని గౌస్ నగర్ వద్ద గోడ కూలి పై నుండి బండ రాళ్ళు పడటంతో ఒకే కుటుంబంలోని ఐదుగురితో సహా మొత్తం 9 మంది మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గౌస్ నగర్లోని మహమ్మదీయ కాలనీలో కనీసం 10 ఇళ్లపై గ్రానైట్ రాళ్లు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇళ్ళపై కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. మరణించిన తొమ్మిది మందిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. జిహెచ్ఎంసి విపత్తు నిర్వహణ బృందంతో పాటు సంఘటన స్థలానికి చేరుకుని శిధిలాల నుంచి మృతదేహాలను బయటకు తీశారు .
నీట మునిగిన ఓల్డ్ సిటీ .. మల్లాపూర్ లో విద్యుత్ షాక్ తో ఒకరు మృతి
పోలీసులు అక్కడ పరిస్థితిని సమీక్షించారు . గ్రానైట్ రాళ్ళు ఇళ్లపై పడటంతో రెండు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఫలితంగా తొమ్మిది మంది మరణించారని పోలీసులు తెలిపారు.ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన గురించి ఆరా తీశారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వర్షాల కారణంగా షాహీన్ నగర్, జల్ పల్లి , సయీద్ నగర్, బాలాపూర్, ఉస్మాన్ నగర్ వంటి ప్రాంతాలు మరియు ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.హైదరాబాద్ లోని మల్లాపూర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఫణి కుమార్ అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు .
ఖమ్మంలో ప్రభుత్వాసుపత్రిలోకి వరదనీరు .. వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి కోసం గాలింపు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి వద్ద రాథోని వాగు పొంగి ప్రవహిస్తుంది. వాగును దాటే క్రమంలో మల్లెల రవి అనే వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. తన కొడుకుతో పాటు, రవి వారి పొలానికి వెళ్ళటానికి వాగును దాటుతున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. రవి కుమారుడు రాజేష్ చెట్టును పట్టుకుని బయటపడగా, రవి కొట్టుకుపోయాడు.అతని కోసం గాలింపు చేపట్టారు. ఖమ్మం ,భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో సోమవారం రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మంపట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోకి వర్షపునీరు వచ్చి చేరింది. ఇన్పేషెంట్ వార్డులో మోకాలి లోతు నీరు చేరింది . వర్షం కారణంగా నవజాత శిశువులతో ఉన్న మహిళలు ఆసుపత్రిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . ఆస్పత్రులలో ఉండలేక వెళ్ళిపోతున్నారు .
లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికార గణం ... ఇప్పటివరకు 30 మంది గల్లంతు
బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హిమయత్ నగర్, బషీర్ బాగ్ , నాంపల్లి, లక్ది కా పుల్, మెహదీపట్నం, టోలీ చౌకి, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ మరియు బంజారా హిల్స్ వంటి రద్దీ ప్రాంతాలలో రోడ్లు నీట మునిగిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్ళు నీట మునగటంతో అనేకమంది నిరాశ్రయులయ్యారు. చాలా ప్రాంతాల్లో నివాసితులను రాత్రిపూట ఖాళీ చేయించారు అధికారులు .ఇప్పటివరకు వర్ష బీభత్సానికి దాదాపు 30 వాహనాలు కొట్టుకుపోగా, 30మంది గల్లంతు అయ్యారు . ఇంకా రెండు రోజుల పాటు వర్ష బీభత్సం కొనసాగుతుంది అని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలెర్ట్ అయింది.