మరో చిన్నారి కిడ్నాప్ విషాదాంతం... కుళ్లిపోయిన మృతదేహం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో చిన్నారి దీక్షిత్ కిడ్నాప్,హత్య ఘటన మరవకముందే తెలంగాణలో మరో కిడ్నాప్,హత్య ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో అదృశ్యమైన అథియాన్ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దుండగులు వేరే చోట బాలుడిని హత్య చేసి.. మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు అనుమానిస్తున్నారు.
Girlfriend: ప్రియుడి పక్కా స్కెచ్, ప్రియురాలి కిడ్నాప్,ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్,పోయేకాలం పిలిచింది!
పోలీసుల కథనం ప్రకారం...
శామీర్పేట పోలీసుల కథనం ప్రకారం... శామీర్పేటకు చెందిన సయ్యద్ ఉసేన్,గౌజ్బీ దంపతుల మూడో కుమారుడు అథియాన్ (5) స్ఠానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. ఈ నెల 15న మధ్యాహ్నం సమయంలో ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన అథియాన్ మళ్లీ తిరిగిరాలేదు. చీకటి పడినా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎన్నిచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అక్టోబర్ 15న కిడ్నాప్...
ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం సయ్యద్ ఉసేన్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ కుమారుడిని కిడ్నాప్ చేశామని రూ.15లక్షలు ఇస్తేనే వదిలిపెడుతామని అవతలి వైపు వ్యక్తి చెప్పాడు. దీనిపై సయ్యద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సోన్సోన్(25)గా గుర్తించిన పోలీసులు... అతను సయ్యద్ పక్క పోర్షన్లోనే అద్దెకు ఉంటున్నట్లు గుర్తించారు.
11 రోజుల క్రితమే హత్య
పోలీసుల విచారణలో నిందితుడు సోన్సోన్ బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. 11 రోజుల క్రితమే బాలుడిని హత్య చేసినట్లు చెప్పాడు. నిందితుడు తెలిపిన వివరాల ఆధారంగా శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లిన పోలీసులు... రోడ్డు పక్కన బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. హత్య జరిగి చాలా రోజులు కావడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందన్నారు. తమ కుమారుడు హత్యకు గురయ్యాడని తెలియడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మహబూబాబాద్ ఘటన మరవకముందే...
ఇటీవలే మహబూబాబాద్ జిల్లాలోనూ దీక్షిత్ అనే చిన్నారి కిడ్నాప్ విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కిన మంద సాగర్ అనే ఓ బైక్ మెకానిక్ ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డాడు. దీక్షిత్ను నమ్మించి తన బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లిన అతను... కేసముద్రం మండలం అన్నారం శివారు గుట్టల్లో హత్యకు పాల్పడ్డాడు. అనంతరం పెట్రోల్తో బాలుడి మృతదేహాన్ని తగలబెట్టాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు ఇంటికి చేరుకుని... ఇంటర్నెట్ సాయంతో దీక్షిత్ తల్లికి ఫోన్ చేసి రూ.45లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీక్షిత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... పక్కా స్కెచ్తో పోలీసులు సాగర్ను పట్టుకున్నారు. అయితే అప్పటికే దీక్షిత్ను అతను హత్య చేసినట్లు గుర్తించారు.