వామ్మో హిజ్రాలు.. హైదరాబాద్లో బీభత్సం.. వాహనదారుల దోపిడీ, పీఎస్పై దాడి
హైదరాబాద్ : హిజ్రాలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ పైనే దాడికి తెగబడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. ఇటీవల నగరంలో హిజ్రాల బెడద వీపరీతంగా పెరిగిందనే నేపథ్యంలో తాజా ఘటన మరింత ఉలిక్కిపడేలా చేసింది. ఉప్పల్ లో హిజ్రాలు సృష్టించిన బీభత్సం కలవరం రేపుతోంది.
పోలీసులపై దాడి
హైదరాబాద్ లో హిజ్రాలు బీభత్సం సృష్టించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపంలో విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనదారులను ఆపి వారిపై ఇష్టారాజ్యంగా దాడికి దిగారు. నగదు, పర్సులు, ఫోన్లు బలవంతంగా తీసుకోవడమే గాకుండా మెడల్లో నుంచి బంగారు గొలుసులు కూడా లాక్కున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టారు. వారిని వెంబడిస్తూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు హిజ్రాలు. అక్కడ కూడా వీరంగం సృష్టించారు. అక్కడి పూలకుండీలను ధ్వంసం చేయడమే గాకుండా.. అడ్డొచ్చిన ముగ్గురు పోలీసులను కూడా తీవ్రంగా గాయపరిచారు.
రెచ్చిపోయిన హిజ్రాలు
అర్ధరాత్రి కావడం, పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండటంతో హిజ్రాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. హిజ్రాలు పెద్దసంఖ్యలో ఉండటంతో పోలీస్ స్టేషన్లో నానా హంగామా సృష్టించారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఏసీపీపైకి దూసుకెళ్లి దాడికి యత్నించారు. పోలీస్ స్టేషన్ అని కూడా చూడకుండా రెచ్చిపోయిన హిజ్రాలు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. స్టేషన్ కు చేరుకున్న సీఐ బాధితుల నుంచి, గాయపడ్డ పోలీసుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. వారిని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి పంపే క్రమంలో కొంతదూరం వెంబడించారు హిజ్రాలు.
ఇంత దారుణమా?
అర్ధరాత్రి మొదలైన హిజ్రాల టార్చర్ తెల్లవారుజాము 3- 4 గంటల వరకు కొనసాగినట్లు తెలుస్తోంది. హిజ్రాల దాడిలో ప్రదీప్ రెడ్డి, రాంరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రదీప్ రెడ్డి కారు ధ్వంసమైంది. రాంరెడ్డి నుంచి పర్సుతో పాటు ఫోన్, గొలుసు లాక్కున్నట్లు ఫిర్యాదు చేశారు. హిజ్రాల బీభత్సానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హిజ్రాలు దాడి చేయడం ఇదివరకు చాలాసార్లు జరిగింది. కానీ ఈ లెవెల్లో రెచ్చిపోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులను డబ్బుల కోసం వీపరీతంగా వేధిస్తుంటారు. ఇచ్చినంత తీసుకోక ఎక్కువ మొత్తం కావాలంటూ డిమాండ్ చేస్తారు. ఇక నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దుకాణాల చుట్టూ తిరుగుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇందులో నిజమైన హిజ్రాల కంటే డూప్లికేట్ హిజ్రాలు ఎక్కువయ్యారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి హిజ్రాల బెడదతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. పోలీస్ స్టేషన్ పైనే దాడి చేయడం చూస్తుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడిదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.