డోర్ డెలివరీ... తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు.. ప్రారంభించిన మంత్రి పువ్వాడ
తెలంగాణ ఆర్టీసీ కార్గో విభాగం మరో అడుగు ముందుకు వేసింది. ప్రయోగాత్మకంగా గురువారం (డిసెంబర్ 10) నుంచి పార్శిల్ డోర్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్లో ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించారు.దీని ద్వారా పార్శిళ్లు నేరుగా ఇంటి వద్దకే చేరనున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ... గత 3 నెలలుగా కొరియర్ పార్శిళ్ల సేవల్లో తెలంగాణ ఆర్టీసీ వేగవంతమైన వృద్ది సాధించిందన్నారు. ఆర్టీసీ కార్గో ద్వారా ఇప్పటివరకూ 12,50,000 పార్శిళ్లను రవాణా చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఈ సంఖ్య 25లక్షలకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సేవల ద్వారా రోజుకు రూ.15లక్షలు ఆదాయం వస్తోందన్నారు. తాజాగా ప్రారంభించిన డోర్ డెలివరీ సేవలను జేబీఎస్,ఎంజీబీఎస్,కూకట్పల్లి ప్రాంతాల నుంచి మూడు ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు.
కేవలం తెలంగాణలోనే కాకుండా కర్ణాటక,మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ సర్వీసులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి రెండు,మూడు రోజులు జీతాలు ఆలస్యమవుతున్నందునా ఉద్యోగులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇప్పటికే రూ.800కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఆర్టీసికి చేరిందన్నారు. సీసీసీఎస్కు రూ.230 కోట్లు అదనంగా జమ చేశామని... రూ.600 కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు మంత్రి కేటీఆర్ సూచన చేసినట్లు తెలిపారు. నగరంలో తిరుగుతున్న బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు.
కార్గో పార్శిల్ హోమ్ డెలివరీ సేవలు హైదరాబాద్లో విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా పార్శిల్ కార్గో సేవలను ఆర్టీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. తక్కువ కాలంలోనే రోజువారీ ఆదాయాన్ని ఆర్టీసీ వృద్ధి చేసుకుంటూ వస్తోంది.ఇతర కార్గో సేవలతో పోలిస్తే ఆర్టీసీ కార్గో సేవలు తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పార్శిల్ డోర్ డెలివరీ సేవలకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. ఎప్పుడూ నష్టాల్లో ఉండే ఆర్టీసి కార్గో సర్వీసులు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మారాయి. తక్కువ కాలంలోనే కార్గో సేవలు ప్రజలకు చేరువయ్యాయి. కార్గో డోర్ డెలివరీ సేవలకు కూడా ప్రజల నుంచి ఆదరణ లభించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించగలిగితే భవిష్యత్తులో ఆదాయం గణనీయంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ దీనిపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తోంది.