పారాసిటామాల్ కు బదులుగా ట్రెమడాల్... చిన్నారుల ప్రాణాలతో చెలగాటమా ?
వైద్య సిబ్బంది నిర్వాకం ఓ తల్లికి కడుపుకోతను మిగిల్చింది. నవమాసాలు మోసి కని ప్రేమగా పెంచుకున్న బిడ్డ అర్ధాంతరంగా తిరిగిరాని లోకాలకు చేరుకుంటే కంటికి కడివెడు శోకిస్తోంది . ఆసుపత్రి వైద్య సిబ్బంది ఒక చిన్నారి మరణానికి కారణం అవడమే కాకుండా, మరో 22 మంది ప్రాణాలతో చెలగాటం ఆడితే పట్టించుకోని పాలకుల తీరును సమాజం ప్రశ్నిస్తోంది.
వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి.. మరో 14 మందికి అస్వస్థత
వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత పారాసిటామాల్ కు బదులుగా ట్రెమడాల్
వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పారాసిటామాల్ కు బదులుగా ట్రెమడాల్ టాబ్లెట్ ఇస్తే ఆ టాబ్లెట్ లు వేసిన చిన్నారులు అల్లాడిపోయారు. ఒక్కసారిగా అస్వస్థతకు గురైన చిన్నారులను చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లి ఆస్పత్రిలో చేర్పించారు.
నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో చోటు చేసుకున్న ఘటన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఒక చిన్న తప్పిదం వల్ల ఇప్పటివరకు 22 మంది చిన్నారులు నీలోఫర్ ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థతతో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వీరందరికీ చికిత్స జరుగుతున్నా , కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ ఘటనకు కారణాలు తెలియదు అన్న వైద్యులు ఒక్కసారిగా చిన్నారులు అస్వస్థతకు గురి కావడానికి కారణం వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేనని తేల్చి చెప్పారు .
వైద్య సిబ్బంది నిర్వాకం .. ఒక బాబు మృతి , ఇప్పటివరకు 22 మందికి అస్వస్థత
ఈ ఘటనపై నీలోఫర్ సూపరింటెండెంట్ డా. మురళి మాట్లాడుతూ నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో మార్చి 06వ తేదీ బుధవారం 90 మంది చిన్నారులకు టీకాలు ఇచ్చారన్నారు. తరువాత ఇచ్చే మందుల్లో పొరపాటు జరిగిందని, పారాసిటమాల్కు బదులు ట్రమడోల్ టాబ్లెట్ ఇచ్చారని, జ్వరం తగ్గడం కోసం ఇచ్చే టాబ్లెట్ డోస్ ఎక్కువ ఉండడంతో చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఫలితంగా 22 మంది చిన్నారులు నీలోఫర్ ఆసుపత్రిలో చేరితే ఒక బాలుడు మృతి చెందాడన్నారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురికి వెంటిలెటర్పై చికిత్స అందిస్తున్నట్లు నీలోఫర్ సూపరింటెండెంట్ డా. మురళి వెల్లడించారు.
వైద్య పరిజ్ఞానం లేకనా నిర్లక్ష్యమా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
చిన్నారులకు ట్రెమడాల్ టాబ్లెట్ ఇవ్వొచ్చా లేదా? అన్న కాసింత వైద్య పరిజ్ఞానం కూడా లేనట్లుగా ప్రవర్తించిన వైద్య సిబ్బంది తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. నిర్లక్ష్య ధోరణి లో, ఏమీ కాదులే అన్న భావనతో ట్రెమడాల్ ఇచ్చారా? లేక తెలియక ఇచ్చారా? ఎలా వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన వారి ప్రాణాలను కాపాడాల్సింది పోయి నిర్లక్ష్యధోరణితో ప్రాణాల మీదకు తీసుకు వస్తున్న వైద్య సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఒక బాలుడు మృతి చెందడంతో, తమ బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆవేదన చెందుతున్నారు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడిన వైద్య సిబ్బంది పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.