ఇదీ మమతా బెనర్జీ అనుభవం!: కేసీఆర్కు తృణమూల్ కాంగ్రెస్ నేత ఝలక్
కోల్కతా/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా భువనేశ్వర్, కోల్కతా, ఢిల్లీలలో పర్యటించారు. నవీన్ పట్నాయక్ను కలిసి ఫ్రంట్ పైన చర్చించారు. ఆ తర్వాత కోల్కతా వెళ్లి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు.
అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం పరోక్షంగా సీఎం కేసీఆర్కు షాకిచ్చారు. రాజకీయాల్లో మమతా బెనర్జీ అనుభవం ఎక్కువ అని కేసీఆర్ పర్యటనను ఒకింత తక్కువ చేసే ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు టీఎంసీ నేత డెరెక్ ఓ బ్రెయిన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదీ మమతా బెనర్జీ రాజకీయ అనుభవం
కేసీఆర్, మమతా బెనర్జీల భేటీని ఉద్దేశించి డెరెక్ ఓ బ్రెయిన్ మాట్లాడుతూ... తమ పార్టీ అధినేత్రి (మమతా బెనర్జీ) ఏడుసార్లు ఎంపీగా గెలిచారని, రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, మూడుసార్లు కేంద్రమంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. నలభై ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నారని చెప్పారు. ధైర్యశాలి అన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ ఆదరబాదరాగా చేయాల్సింది కాదు: మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ
ఆమెతో ప్రతి ఒక్కరు తమ ఆలోచనలు పంచుకుంటారు
ఈ విషయాలను పక్కన పెడితే, ప్రతి ఒక్కరు కూడా ఆమె మాటను ఆలకిస్తారని డెరెక్ ఓ బ్రెయిన్ అన్నారు. అందరూ కూడా తమ తమ ఆలోచనలను ఆమెతో పంచుకుంటారని తెలిపారు. 2019 లోకసభ ఎన్నికల దృష్ట్యా ఇది సహజమేనని అభిప్రాయపడ్డారు. తద్వారా కేసీఆర్ కంటే ఆమె గ్రేట్ అనే చెప్పే ప్రయత్నాలు అని అంటున్నారు.
కేసీఆర్కు స్వాగతం
కాగా, సోమవారం కోల్కతా వచ్చిన కేసీఆర్కు మమత స్వయంగా సచివాలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి స్వాగతం పలికారు. ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి సీఎం అయిన కేసీఆర్కు అభినందనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. ఆమెకు పోచంపల్లి చీర, కాకతీయ తోరణం ప్రతిమను కేసీఆర్ అందించారు. అనంతరం వారిద్దరు మీడియాతో మాట్లాడారు.
లోకసభలో ఇవే ఫలితాలు
మమతతో జరిగిన సమావేశంలోనూ కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఇటీవలి శాసనసభ ఎన్నికల గురించి ప్రస్తావించారని తెలుస్తోంది. లోకసభ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు వస్తాయని, 16 స్థానాలు గెలుస్తామని చెప్పారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, మరికొన్ని పార్టీలతో పోటీ చేసిందని, రాహుల్ గాంధీ పర్యటించారని, సోనియా గాంధీ కూడా ప్రచారానికి వచ్చారని, చంద్రబాబు ఈ కూటమి తరఫున తిరిగారని, మరోవైపు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, అయిదుగురు ముఖ్యమంత్రులు ప్రచారం చేసినా తాము ఘన విజయం సాధించామని కేసీఆర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లోనూ పోరాడదామని తెలంగాణ సీఎం చెప్పారని తెలుస్తోంది.