ట్రిపుల్ ‘ఐ’తో ముందుకు: బయో ఆసియా సదస్సులో కేటీఆర్
హైదరాబాద్: సాంకేతికత, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ రాణిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్ నుంచి ఉత్పత్తయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్ నుంచే 35 శాతం తయారవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో ఫార్మాసిటీ అవసరాన్ని కేంద్రం గుర్తించిందని, అందుకే అన్ని అనుమతులూ వచ్చాయని తెలిపారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన బయో ఆసియా అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐ(ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్) నినాదంతో ముందుకెళ్తామని కేటీఆర్ వివరించారు.
276 ఎకరాల్లో వైద్య పరికరాల పార్క్ ఏర్పాటైందని చెప్పారు. రెండేళ్ల వ్యవధిలోనే 20 సంస్థలు తమ ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ను హైదరాబాద్లో ప్రారంభించబోతున్నామని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ సదస్సులో 37 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సిన్ జీన్ బయోటెక్ రిసర్చ్ సెంటర్ను కేటీఆర్ ఆవిష్కరించారు. బయో ఆసియా సదస్సు అంతర్జాతీయంగా హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని తెలిపారు. కాగా, ఈ బయో ఆసియా సదస్సు మూడు రోజులపాటు జరగనుంది.