గ్రేటర్ పోలింగ్: చైతన్యపురిలో ఉద్రిక్తత, టీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల డిష్యూం డిష్యూం..
గ్రేటర్ పోలింగ్ ప్రారంభమైంది. 150 డివిజన్లలో ఓటింగ్ కొనసాగుతోంది. అయితే చైతన్యపురి డివిజన్లో ఓ నేత ఇంట్లో లభించిన మద్యం బాటిళ్ల అంశం వివాదంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాటకు దారి తీసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. అడ్డుకోబోయిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రంగా నర్సింహాగుప్తా స్వల్పంగా గాయపడ్డారు
గొడవ విషయం తెలుసుకున్న చైతన్యపురి ఇన్స్పెక్టర్ రవికుమార్ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులు సుధాకర్యాదవ్, శేఖర్, నవీన్యాదవ్ను నెట్టివేశారు. నవీన్యాదవ్ పెదవి పగిలి, మూతికి గాయం కాగా.. సుధాకర్ యాదవ్కు కూడా గాయాలయ్యాయి. శేఖర్ చొక్కా చినిగిపోయింది. బీజేపీ కార్యాలయంపై దాడి చేసేందుకు వచ్చిన టీఆర్ఎస్ నేతల్ని వదిలేసి, తమపై లాఠీచార్జి చేసి గాయపరిచారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
Recommended Video
టీఆర్ఎస్ అభ్యర్థి జిన్నారం విఠల్రెడ్డి, కార్యాలయానికి వచ్చిన ఆ పార్టీ నేతలపై చర్యలు చేపట్టాలని నినదించారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారికి మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. లాఠీచార్జి చేసిన చైతన్యపురి ఇన్స్పెక్టర్ రవికుమార్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఏసీపీ శ్రీధర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.
ఆదివారం సాయంత్రం ప్రచార పర్వం ముగిసినప్పటి నుంచీ ఆయా పార్టీలు ప్రలోభ పర్వానికి తెర లేపాయి. జోరుగా నగదు పంపిణీ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నేతలు, మరో పార్టీని పట్టుకుని పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేశారు. ఇది కొన్ని చోట్ల ఘర్షణకు దారి తీసింది. ఉద్రిక్తత ఏర్పడింది.