రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి.. రాజ్యసభలో టీఆర్ఎస్ గళం
Recommended Video
హైదరాబాద్ : రిజర్వేషన్లు అమలుచేసుకొనే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఈక్రమంలో రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపించారు ఎంపీ బండా ప్రకాశ్. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా ప్రకాశ్ మాట్లాడారు. ఆ బిల్లుకు టీఆర్ఎస్ తరపున మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పాలన కారణంగానే అగ్రవర్ణ పేదలు.. రిజర్వేషన్లు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు.
దేశమంతటా ఒకేలా..! లేదంటే రాష్ట్రాలకు అధికారం
దేశమంతటా రిజర్వేషన్లు ఒకేవిధంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకురావాలని కోరారు ప్రకాశ్. లేదంటే రిజర్వేషన్లు ఇచ్చుకునే అధికారం రాష్ట్రాలకే అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. 50శాతానికి రిజర్వేషన్లు మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన దరిమిలా.. రిజర్వేషన్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అమలవుతున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా 80శాతం రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే రాజస్థాన్ లో 54, జార్ఖండ్ లో 60, మహారాష్ట్రలో 68, తమిళనాడులో 69, హర్యానాలో 70శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 50శాతం రిజర్వేషన్లు ఉండటం గమనార్హమన్నారు.
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మరోసారి..!
మరి ఆ రిజర్వేషన్ల సంగతేంటి?
ఎస్టీలకు 10శాతం, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నోసార్లు కోరినా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ప్రకాశ్. టీఆర్ఎస్ ఎంపీలందరూ పార్లమెంటులో నిరసన తెలిపినా స్పందించలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో ఎస్టీ, ముస్లిం జనాభా పెరిగిందని గుర్తుచేశారు. జనాభా దమాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 90.65 శాతముంటే.. అగ్రవర్ణాల ప్రజలు 9.35శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు. అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడం లాంటి బిల్లులు తెచ్చే ముందు.. తెలంగాణకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లులను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో అది సాధ్యమైంది..!
బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా కేంద్రం స్పందించలేదని ఆరోపించారు ప్రకాశ్. సుప్రీంకోర్టు తీర్పుతో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 24శాతానికి పడిపోయాయని వాపోయారు. తెలంగాణలోని అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు లేకున్నా.. విద్యార్థులకు స్కాలర్షిప్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో విద్యను అభ్యసించడానికి 20 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ఈబీసీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నామని వివరించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తుండటం తెలంగాణలో సాధ్యమైందన్నారు. నామినేటెడ్ పోస్టులకు కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని వెల్లడించారు.