కేసీఆర్కు కూడా "రిటర్న్ గిప్ట్" వస్తోందా!.. టీఆర్ఎస్ మాజీ నేత కీలక వ్యాఖ్యలు
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పరిణామక్రమంలో "రిటర్న్ గిఫ్ట్" బాగా ప్రాచుర్యం పొందింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టారని.. ఆయనకు అదే రీతిలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు కేసీఆర్. అలా రిటర్న్ గిఫ్ట్ అనే పదం నేతల నోళ్లల్లో నానుతోంది. అటు ఏపీకి చెందిన టీడీపీ నేతలు కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే తాజాగా కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ టీఆర్ఎస్ మాజీ లీడర్ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చానీయాంశమైంది.
కేసీఆర్కు నేనిస్తాగా..!
కారు దిగి కమలం గూటికి చేరిన ఎంపీ జితేందర్ రెడ్డి కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్నగర్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డీకే అరుణను గెలిపించి.. కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న జితేందర్ రెడ్డి.. బీజేపీ తీర్థం పుచ్చుకోగానే ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. కారులో ఉన్నప్పుడు బాస్ చెప్పిందే వేదమన్నట్లుగా మాట్లాడిన జితేందర్ రెడ్డి.. ఇప్పుడు కమలం గూటికి చేరగానే ట్రెండ్ మార్చారు.
ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?
కేసీఆర్ పడేస్తే.. మోడీ లేపారు..!
ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్పై సర్జికల్ స్ట్రైక్ చేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం తన స్నేహితులపై సర్జికల్ అటాక్స్ చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన తనకు టికెట్ ఎందుకు నిరాకరించారో అర్థం కాలేదన్నారు. టికెట్ ఇవ్వడం లేదనే విషయంపై కనీసం సమాచారం ఇవ్వకపోవడం దారుణమని వాపోయారు. కేసీఆర్ తనను కిందపడేస్తే.. మోడీ చెరదీశారని చెప్పుకొచ్చారు.
ఆయనొచ్చాక బీజేపీకి బలం : డీకే అరుణ
బీజేపీ గెలుపే ధ్యేయంగా ముందుకెళతానని చెప్పారు జితేందర్ రెడ్డి. మహబూబ్నగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో కాషాయం జెండా రెపరెపలాడుతుందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ బంపర్ మెజార్టీ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన జితేందర్ రెడ్డి.. 300 స్థానాల్లో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. అదలావుంటే జితేందర్ రెడ్డి చేరికతో తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని డీకే అరుణ వ్యాఖ్యానించండం విశేషం.