ప్రజా పల్స్ పట్టుకోవడంలో టీఆర్ఎస్ విఫలం..!అధినేత ఒంటెద్దు పోకడే తేడా చేసిందంటున్న శ్రేణులు..!!
Recommended Video
హైదరాబాద్ : ప్రజల్లో భావోద్వేగాలను ప్రతిసారి రెచ్చ గొట్టానుకోవడం పొరపాటు. తెలంగాణలో సమర్థవంతమైన రాజకీయాలు నడిపించడంలో తమను మించిన వారు లేరనుకునే మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా గ్రహపాటుగానే మారుతుంది. తెలంగాణలో అదికార పార్టీ అవలంబింస్తున్న విధానల పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికల్లో గెలిచిన చంద్రశేఖర్ రావు లో తెలియని అహంకారం పెరిగిందని, మరో పాతికేళ్ల పాటు గులాబీ పార్టీ పాలన కొనసాగాలనేంతగా రాజకీయాలను ప్రభావితం చేయాలని చంద్రశేఖర్ రావు ఉవ్విళ్లూరుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకు లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని విశ్లేషిస్తున్నారు.
ప్రజల మనోభావాలు కూడా ముఖ్యమే..! నోరు పారేసుకుంటే ఇలాగే ఉంటదంటున్న నేతలు..!!
కేంద్రంలో నాడు నెలకొన్న అనిశ్చితి.. మోదీపై వ్యతిరేకత అన్నీ అవకాశం చేసుకుని తాను కూడా 16 మంది ఎంపీలతో చక్రం తిప్పాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మదిలో దూరిన మరో ఆలోచన. దీంతో ప్రాంతీయపార్టీల చుట్టూ.. అదికూడా.. బీజేపీని వ్యతిరేకించే వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కాలం వెళ్లబుచ్చారు. మోదీ.. గీదీ జాన్తానై.. మన చంద్రశేఖర్ రావు సారే ప్రధానమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారంటూ మరీ గొప్పలు చెప్పుకున్నారు. ఒకానొక సమయంలో చంద్ర శేఖర్ రావు సారే ప్రధాన మంత్రి అనే స్థాయికి వెళ్లారు గులాబీ నేతలు.
గులాబీ పార్టీ పటిష్టంగా ఉందనుకున్న అధినేత..! ప్రజల నాడి తెలుపుకోలేక పోయిన కేసీఆర్..!!
జాతీయపార్టీల బలం, ఉత్తరాధి ఆధిపత్యం కాదని.. 16 సీట్లతో చంద్రశేఖర్ రావు, ఢిల్లీని ఏలుతాడంటూ గులాబీదళం ఊరూవాడా ప్రచారం చేసుకుని పరువు పోగొట్టుకునేంత వరకూ చేరింది. ఎన్నికల్లో కారు పదహారు నినాదంతో మరీ ఓవర్యాక్షన్ ప్రదర్శించారు. ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మరచిపోయి ప్రవర్తించారు. దాని ఫలితమే.. కాంగ్రెస్ పుంజుకోవటం, బీజేపీకి జనాలు జై కొట్టడంతో ఆకాశం నుంచి చంద్రశేఖర్ రావు అనుచరగణం భూమ్మీదకు వచ్చింది. నిజామాబాద్, కరీంనగర్లో జరిగిన పరాభవం నుంచి బయటపడేందుకు గులాబీ పార్టీకి మరో సంవత్సరం పడుతుందని చర్చ జరుగుతోంది.
కవిత ఓటమి తలవంపులే..! మేధోమదనంలో గులాబీ అగ్రనేతలు..!!
నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో ధర్మపురి అర్వింద్ తన తండ్రి డి.శ్రీనివాస్కు జరిగిన పరాభవానికి బదులు తీర్చుకున్నారు. అక్కడ పసుపు రైతుల కడుపుమంటకు ప్రతికారంగా కల్వకుంట్ల కవితను ఘోరంగా ఓడించారు. కరీంనగర్, మహబూబ్నగర్లో బీజేపీ విజయకేతనం పుండుమీద కారం చల్లినట్టుగా మారింది. మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి వారసులుగా సికింద్రాబాద్, మల్కాజగిరిలో గెలుపు పక్కా అని భావించిన తలసాని సాయికిరణ్ యాదవ్, మర్రి రాజశేఖర్రెడ్డి ఇద్దరూ కూడా ఓటమిపాలయ్యారు. అధికార పార్టీ ఏది చెబితే తాము దానికే తలలూపే స్థాయిలో లేమంటూ నియోజకవర్గ ఓటర్లు తీర్పునిచ్చారు.
లోక్ సభలో టీఆర్ఎస్ కు ఓటేయని జనం..! పుంజుకుంటున్న ప్రతిపక్షాలు..!!
గ్రేటర్, ముందస్తు ఎన్నికల్లో విజయాలు సాధించిన గులాబీ పార్టీ, అదే వేగంతో స్థానిక ఎన్నికలకు జై కొట్టింది. ఏదోమూలన భయం వెంటాడటంతో యునాన్మస్ గా అభ్యర్థులను గెలిపించేందుకు ప్రణాళిక రచించింది. అయితే ఎంపీ సీట్ల విషయానికి వచ్చేసరికే.. చాలామంది ఎమ్మెల్యేలు అధికారపార్టీకి సహకరించలేదనే విమర్శలున్నాయి. ఆరు నెలల క్రితమే డబ్బులు కుమ్మరించి.. ప్రచారంలో అలసిపోయిన ఎమ్మెల్యేలు బయటకు రాలేకపోయారు. అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. ఫలితంగా.. జనం కూడా జాతీయపార్టీలకు జై కొట్టారు. ఏ పార్టీ అయినా.. జనానికి దూరమైతే.. తాము కూడా పార్టీలకు దూరమవుతామనే సంకేతాన్ని పంపారు. గులాబీపార్టీకి మంచి గుణపాఠం నేర్పారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.