కోడికూతకు ముందే తెల్లారే..! జంపింగ్ లతో టీఆర్ఎస్ అలర్ట్.. ఎంఎల్సీ సస్పెన్షన్
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ స్ట్రాటజీ అంతా ఇంతా కాదు. ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల్లోని నేతలను గులాబీవనంకు రప్పించారు. దాంతో కారు స్పీడ్ కు బ్రేకులు వేయలేక ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకున్నారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జంప్ జిలానీల సంఖ్య మరింత పెరిగింది. ఇతర పార్టీలను వీడి గులాబీ గూటికి చేరినవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పల్టీలు కొడుతోంది. కారు గేరు రివర్సయినట్లు కనిపిస్తోంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో టీఆర్ఎస్ పెద్దలు అలర్టయ్యారు. అందులోభాగంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్సీని బహిష్కరించారు.
వంద సీట్లల్లో గెలుస్తాం, మళ్లీ అధికారం మాదేనంటూ చెబుతూ వస్తున్నారు టీఆర్ఎస్ బాస్ కేసీఆర్. అయితే టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా అటు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అందులోభాగంగా గులాబీ నేతలు కొందరిని హస్తం గూటికి లాగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం మొదలయింది. ఇటీవల ఇద్దరు ఎంపీలు కారు దిగి చేయి అందుకుంటారనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజం చేశారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. దీంతో అలర్టైన టీఆర్ఎస్ పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
అలర్ట్.. జంపింగ్ కు ముందే సస్పెండ్
కీలక సమయమైన ఎన్నికల వేళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి పార్టీని వీడటం గులాబీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా టీఆర్ఎస్ ను వీడేందుకు చాలామంది లైన్లో ఉన్నారనే కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలతో అలర్టయ్యారు. అందులోభాగంగా ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిపై వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. దీనికి సంబంధించి పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన వెలువడింది.
పార్టీని వీడారంటే బాగుండదు.. తామే సస్పెండ్ చేశామంటే క్రెడిట్
యాదవరెడ్డి కూడా టీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతారనే వార్తల నేపథ్యంలో పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీని వీడారనే ప్రచారం జరగకుండా ముందస్తుగానే సస్పెండ్ చేసినట్లు సమాచారం. పార్టీ నుంచి చాలామంది వెళ్లిపోతున్నారనే భావన మంచిది కాదనే ఉద్దేశంతో ఇలా యూ టర్న్ తీసుకుని యాదవరెడ్డిని బహిష్కరించినట్లు తెలుస్తోంది.
అదలావుంటే యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ సమక్షంలో యాదవరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం మేడ్చల్ లో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మరోవైపు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కూడా అదే వేదికపై కాంగ్రెస్ లో చేరనున్నారు.
గులాబీ పెద్దల నజర్.. ముందస్తు చర్యలు
టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు చెప్పడాన్ని తొలుత గులాబీ పెద్దలు లైట్ గా తీసుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పదేపదే ప్రస్తావించినా పట్టనట్లు వ్యవహరించారు. తీరా కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ జగదీశ్ రెడ్డి పార్టీని వీడటం టీఆర్ఎస్ శ్రేణులను విస్మయానికి గురిచేశాయి. అయితే వీరిద్దరే కాదు మరికొంతమంది టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ తీర్థం పోస్తామనే ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు గులాబీ పెద్దలను కదిలించినట్లు అర్థమవుతోంది. అందుకేనేమో ఎమ్మెల్సీ యాదవరెడ్డి విషయంలో జాగ్రత్తపడ్డట్లు తెలుస్తోంది. ఆయన పార్టీని వీడారనే ప్రచారం మంచిదికాదని.. తామే బహిష్కరించామంటే క్రెడిట్ దక్కుతుందని భావించినట్లు సమాచారం. మరోవైపు పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న వారిపై నజర్ పెట్టడమే గాకుండా ముందస్తు చర్యలకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.