గ్రేటర్ ప్రచారంలో కారు జోరు .. ఎర్రబెల్లి,తలసానితో పాటు మంత్రుల హడావిడి
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ జోరు చూపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ పార్టీ డివిజన్ స్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలను ఇన్చార్జ్ లుగా నియమించి ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. ప్రజాక్షేత్రంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి రంగంలో దిగిన మంత్రులు,ప్రత్యర్ధి పార్టీలపై మాటలు తూటాలను పేల్చడంతోపాటుగా టిఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు.
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో హడావిడి చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ప్రత్యర్ధి పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు మీర్ పేట్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు . గత రెండు రోజులుగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్న ఆయన, నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లి హడావిడి చేస్తున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించడం తో పాటుగా, బస్తీలో చాయ్ హోటల్స్ వద్ద టీ తాగుతూ సందడి చేస్తున్నారు.
బీజేపీ నేతల బోగస్ ప్రచారం నమ్మొద్దని మంత్రి ఎర్రబెల్లి ప్రచారం
ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్న ఆయన స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు బిజెపి , కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్నారు . ఆరేళ్లలో కేంద్రం నుండి గ్రేటర్ హైదరాబాద్ కోసం బీజేపీ నేతలు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు బోగస్ ప్రచారం చేస్తున్నారని ,అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలు బిజెపి నేతలను నమ్మే రోజులు లేవంటూ స్పష్టం చేశారు .
అభివృద్ధికి ఓటేయ్యమని కోరుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో మత ఘర్షణలు లేవని పేర్కొంటున్న గులాబీనేతలు బిజెపికి ఓటు వేస్తే భవిష్యత్తులో ఉండేది అవే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక సత్యవతి రాథోడ్ కూడా అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కరోనా సమయంలోనూ, వరదలు సమయంలోనూ ప్రజలకు అండగా ఉండి ఆదుకుంది టిఆర్ఎస్ పార్టీనే అని ప్రచారం చేస్తున్నారు.
Recommended Video
సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సుడిగాలి పర్యటన
ఇక నేడు సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పెద్ద ఎత్తున పర్యటిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు .జిహెచ్ఎంసి ఎన్నికల్లో 104 సీట్లు సాధించడం ఖాయమని చెప్తున్నారు. మొత్తానికి ఒక పక్క కేటీఆర్, మరోపక్క కవిత మాత్రమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ మంత్రులు కూడా రంగంలోకి దిగారు. ఇతర పార్టీల కంటే ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ నేతలే ముందున్నారు.