సీఎంగా కేటీఆర్... ఆగని లీకులు.. ప్రత్యర్థులకు అస్త్రంలా.. అసలేం జరుగుతోంది..?
నూతన సంవత్సరంలో మంత్రి కేటీఆర్కు సీఎంగా పట్టాభిషేకం ఖాయమని గత కొద్దిరోజులుగా ప్రచారం జోరందుకుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత మొదలైన ఈ ప్రచారానికి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒకరకంగా వీటిని పార్టీ ఇస్తున్న లీకులుగానే చాలామంది భావిస్తారు. మొదట డోర్నకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మార్చి లోపు కేటీఆర్ సీఎం కాబోతున్నారని 10 రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తాజాగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా తమ వ్యాఖ్యలతో కేటీఆరే కాబోయే సీఎం అన్న సంకేతాలు పంపించారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షాలు కేసీఆర్ను టార్గెట్ చేసే అస్త్రంలా మారుతున్నాయి.
గుత్తా ఏమన్నారు...
తాజాగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. 'కేటీఆర్ డైనమిక్ లీడర్... కింది స్థాయి కార్యకర్తల నుంచి పై వరకూ అందరితో సత్సంబంధాలున్నాయి. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోగల సత్తా ఉంది. ప్రత్యర్థులను తన వాక్చాతుర్యంతో ఇరుకునపెట్టగలరు. తెలుగు,హిందీ,ఇంగ్లీష్,ఉర్దూ నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అడ్మినిస్ట్రేషన్పై మంచి పట్టు ఉంది. అన్నింటికి మించి పట్టుదల ఉన్న యువకుడు... సీఎం పదవికి ఇంతకంటే ఇంకేం అర్హతలు కావాలి.' అని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే లింగయ్య కూడా...
నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. లంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మంత్రి కేటీఆర్కు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లో మంచి ఫాలోయింగ్,పరిపాలనలో విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ అని ప్రశంసించారు.తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతీ అంశంపై కేటీఆర్కు సమగ్ర అవగాహన, పట్టు ఉందన్నారు. అలాంటి నేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు.కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి కేటీఆర్ ఎప్పుడైనా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టవచ్చునని పేర్కొన్నారు.
టీఆర్ఎస్లో అసలేం జరుగుతోంది : మల్లు రవి
అభిప్రాయాలో.. లేదా లీకులో.. కేటీఆరే కాబోయే సీఎం అని ఇలా నేతలంతా వరుసబెట్టి ప్రకటనలు చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్నో అస్త్రంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేటీఆర్కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయని టీఆర్ఎస్ నేతలు ప్రశంసిస్తుంటే... అంటే,కేసీఆర్కు ఆ అర్హతలు లేనట్లా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి... 'కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడని సర్టిఫికెట్ ఇస్తున్నారంటే... మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అసమర్థుడా.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలేం జరుగుతోంది..' అని ట్వీట్ చేశారు.
కేటీఆర్ సీఎం అయితే మరి కేసీఆర్...?
డిసెంబర్,2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు.. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఇదంతా అన్న ప్రచారం జోరుగా జరిగింది. కానీ టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అదంతా వట్టి ఊహాగానమే అని తేలిపోయింది. ఆ తర్వాత కూడా పలుమార్లు కేటీఆర్ సీఎం కాబోతున్నారన్న ప్రచారం జరిగినప్పటికీ స్వయంగా కేటీఆరే ఖండించారు. మరో 10 ఏళ్లు కేసీఆరే సీఎం అని ప్రకటించారు. కేసీఆర్ కూడా తానే సీఎంగా కొనసాగుతానని ఓ సందర్భంలో స్పష్టం చేశారు. అయితే ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికలు,దుబ్బాక ఉపఎన్నికలో పార్టీ బోల్తా కొట్టడంతో కేసీఆర్ అంతర్మథనంలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. తనయుడిని ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వంలో,పార్టీలో ప్రక్షాళన చేసేందుకు ఆయన సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే తనయుడిని సీఎం చేస్తే కేసీఆర్ ఏం చేస్తారన్నది సస్పెన్స్గా మారింది. ఆయన ఇక తన పొలిటికల్ ఇన్నింగ్స్ను ముగించేందుకే నిర్ణయించుకున్నారా.. లేక ఎప్పటిలాగే అంచనాలకు అందని రీతిలో కొత్త వ్యూహం ఏదైనా తెరమీదకు తెస్తున్నారా అన్నది వేచి చూడాలి.