కల్వకుర్తిలో "గులాబీ నేతల లొల్లి"!.. ప్రచారంలో ఫైటింగ్.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ
కల్వకుర్తి : రెండోసారి అధికారంలోకి వచ్చి ఫుల్ స్వింగ్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి.. కొన్నిచోట్ల నేతల తీరు తలనొప్పిగా మారింది. ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ దూసుకెళుతున్న గులాబీ పార్టీని ఇంటిపోరు పరేషాన్ చేస్తోంది. నాగర్కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి సెగ్మెంట్.. వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ తీరుగా సాగుతున్న పంచాయితీకి పార్టీ పెద్దలు సొల్యూషన్ చెప్పినా.. లాభం లేకుండా పోతోంది. తాజాగా ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ ఇద్దరి నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
ప్రచారంలో ఫైటింగ్..!
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ Vs ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అంతలా ఆ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇదివరకు చాలాసార్లు ఆ ఇద్దరు నేతల వర్గీయులు రోడ్డెక్కి కొట్టుకున్నారు. తాజాగా మరోసారి అలాంటి సీన్ రిపీటయింది.
నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి రాములుకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనుచరులు అడ్డుకున్నారు. ప్రచార వాహనంపై ఎమ్మెల్యే ఫోటో లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గానికి చెందిన ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నిజామాబాద్ ఎన్నికలు జరిగేనా?.. M-3 ఈవీఎంలపై అర్ధరాత్రి ఈసీ కసరత్తు..!
ఇదేమి కొత్త కాదు.. ఎప్పుడూ డిష్యుం డిష్యుమే..!
కసిరెడ్డి వర్సెస్ జైపాల్ యాదవ్. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా వీరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటోంది వ్యవహారం. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగి వీరిద్దరికీ సర్ధిచెప్పిన రోజులున్నాయి. కానీ వీరి ప్రవర్తనలో మార్పు లేదు. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్లోనే ఉంటోంది వీరి వాలకం.
2018, డిసెంబర్ 24న నిర్వహించిన కల్వకుర్తి సెగ్మెంట్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం కూడా రసాభాసగా మారింది. మీటింగ్ కు వచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డిని.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గం అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. కసిరెడ్డిపై కుర్చీలతో దాడిచేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని కసిరెడ్డిని అక్కడినుంచి పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది.
ఎమ్మెల్యే టికెట్.. ఇద్దరి మధ్య వార్
కసిరెడ్డి వర్సెస్ జైపాల్ యాదవ్ ఆధిపత్య పోరంతా ఎమ్మెల్యే టికెట్ గురించే. కల్వకుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీకి దూరంగా ఉన్నారు. అంతేకాదు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జరిగింది. ఆ సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన్ని బుజ్జగించారు. భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.
కేటీఆర్ హామీతో అలకపాన్పు దిగిన కసిరెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపునకు కృషి చేస్తానని మాటిచ్చారు. అనంతరం కేటీఆర్తో కలిసి కల్వకుర్తిలో జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు. అలా రాజీ కుదిరిన ఇద్దరి నేతల మధ్య మరోసారి వివాదం ఏర్పడటం జిల్లాలో చర్చానీయాంశమైంది.