ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించింది.. మేనిఫెస్టోపై దానం నాగేందర్
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీ హామీనిచ్చింది. ఈ సారి 20 వేల లీటర్లను ఉచితంగా అందజేస్తామని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అయితే మేనిఫెస్టోపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. పాత చింతకాయ పచ్చడి అంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. కానీ టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం జనరంజకం అని కొనియాడుతున్నారు.
టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫేస్టో ప్రజారంజకంగా ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9 లో గల అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు కూడా పాలాభిషేకం చేశారు. నాయి బ్రాహ్మణులకు , రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం పేదల పట్ల సీఎం కేసీఆర్ చిత్త శుద్ధికి నిదర్శనమన్నారు.
బలహీన వర్గాల మ్యానిపేస్టో అని దానం నాగేందర్ అన్నారు. అన్ని వర్గాల కోసం టీఆర్ఎస్ కృషి చేస్తోందని చెప్పారు. సినీ పరిశ్రమ బలోపేతం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నగర అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతామని చెప్పారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. గతంలో ఆదరించినట్టు ఈ సారి తమను ఆదిరించాలని కోరారు.
ఇటు నామినేషన్ల విత్ డ్రా తర్వాత గ్రేటర్ బరిలో 1121 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 150 వార్డులకు 1893 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. విత్ డ్రా గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి అన్ని డివిజన్లలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిసి 500 మందికిపైగా పోటీలో నిలిచారు.