TRS: కేంద్రంతోో ఘర్షణ వైఖరి: జీఎస్టీ వాటా కోసం: టీఆర్ఎస్ ఎంపీల నిరసన: పార్లమెంట్ ఆవరణలో..!
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమతి.. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరికి దిగిందా? కేంద్రం నుంచి తెలంగాణకు అందాల్సిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిలను దీనికి కేంద్ర బిందువుగా మారిందా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. జీఎస్టీ వాటాల రూపంలో తెలంగాణకు వేల కోట్ల రూపాయల మేర బకాయిలు అందాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఆ నిధులను కేటాయించట్లేదనేది టీఆర్ఎస్ వాదన.
ఔను..నా కాళ్లు కూడా వణుకుతున్నాయ్, లోకేశ్ కామెంట్లపై ఆర్కే రోజా సెటైర్లు
కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు రావాలి?
దేశవ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత ఆయా నిధులన్నీనేరుగా కేంద్రప్రభుత్వానికే చేరుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కేంద్రమే ఆ నిధులను రాష్ట్రాలకు మళ్లిస్తుంది. జీఎస్టీ వాటా కింద తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతం 4,531 కోట్ల రూపాయలు అందాల్సి ఉంది. ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినంత రెండో త్రైమాసికానికి సంబంధించిన నిధుల కోటా మాత్రమే.
కేంద్రానికి కేసీఆర్ లేఖ రాసినా..
ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మొత్తం 19,719 కోట్ల రూపాయలను కేంద్రం ఇప్పటికిప్పుడు తెలంగాణకు మంజూరు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నవంబర్ వరకు కేంద్రం నుంచి తెలంగాణకు విడుదలైన జీఎస్టీ వాటా 10,558 కోట్ల రూపాయలు మాత్రమేనని, మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాలుగు రోజుల కిందటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ సైతం రాశారు.
బదులివ్వని కేంద్రం..
స్వయంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే చొరవ తీసుకుని నిధుల వాటాను విడుదల చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసినప్పటికీ.. పట్టించుకోలేదనేది టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల ఆరోపణ. నిధులను కేటాయించలేకపోతే.. ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే విషయంపై పార్లమెంట్ సాక్షిగా వివరణ ఇవ్వాలనేది వారి డిమాండ్. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శిస్తున్నారు.
నినాదాల హోరు..
ఈ నేపథ్యంలో- బుధవారం ఉదయం వారు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఎంపీలు- నామా నాగేశ్వర రావు, పీ రాములు, మాలోత్ కవిత, భీమ్ రావు బస్వంత్ రావు, జోగిన్ పల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ నినాదాలతో పార్లమెంట్ ఆవరణను హోరెత్తించారు.
ఆర్థిక మాంద్యమే కారణమా?
ప్రస్తుతం దేశంలో ఆర్థికమాంద్యం నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 4.5 శాతానికి దిగజారిపోవడాన్ని దీనికి ఉదాహరణగా చూపుతున్నారు ఆర్థిక నిపుణులు. అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై ఎక్కడా స్పందించలేదు. ఆర్థిక మాంద్యం నెలకొందనే విషయాన్ని అధికారింగా వెల్లడించడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంలో కేంద్రం ఉంటోంది. ఈ ఆర్థికమాంద్యం ప్రభావం వల్లే అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా జీఎస్టీ వాటాలో కోత పెట్టిందని, నిధులను మళ్లించట్లేదని అంటున్నారు.