బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ ఆఫర్.. రూ.5 కోట్లు ఇస్తామని ఫోన్.. బండి సంజయ్ ఫైర్
సీఎం కేసీఆర్కు అహంకారం తగ్గలేదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోయినా వైఖరిలో మార్పు రాలేదన్నారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం.. మేయర్ ఎన్నికను ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. ఆలస్యం ఎందుకు చేస్తుందో అందరికీ తెలుసు అని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ నేతలు ఫోన్స్ చేసి రూ.5 కోట్లు ఇస్తామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గురువారం ఖమ్మంలో బండి సంజయ్ పర్యటించారు. పలువురు నేతలు ఆయన సమక్షంలో బీజేపీకిలో చేరారు.
Recommended Video
ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పొరేషన్ చాలామంది నాయకులు బీజేపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. ఖమ్మం, వరంగల్లో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. కొత్తగూడెం జిల్లా లక్ష్మీ దేవి మండలంలో ఐదుగురు మైనర్ బాలికలపై ప్రధాన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై స్పందించారు. ఘటన బయటకు రాకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పోలీసులపై బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. వారు హీరోలే అని, 15 నిమిషాల పాటు పాతబస్తీని అప్పగిస్తే అంతా జల్లెడ పడతారని తెలిపారు. ఓల్డ్ సిటీలో దాగి ఉన్న రోహింగ్యాలు, పాకిస్తానీలను బయటకు తీస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే వారికి 15 నిమిషాల సమయం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.