టీఆర్ఎస్ డివిజన్కు రూ.5 కోట్లు ఖర్చుచేస్తోంది.. వాటితో అభివృద్ధి చేస్తే బాగుండేదీ: మధుయాష్కీ
గ్రేటర్ ఓటర్లు మరికొద్దీ గంటల్లో తమ తీర్పు ఇవ్వనున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానున్న ఓట్లను.. 4వ తేదీన లెక్కిస్తారు. అయితే విజయంపై ప్రధాన పార్టీలు ధీమాతో ఉన్నాయి. ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్- బీజేపీ మధ్య కనిపిస్తోంది. అయితే ఎంఐఎం, కాంగ్రెస్ తామేమి తక్కువ కాదు అని అంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అంటోంది. గత ఆరేళ్లలో ఏం చేశారని నిలదీస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే పార్టీకే ప్రజలు మద్దతివ్వాలని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ఓటర్లు గుర్తించుకోవాలని కోరారు. టీఆర్ఎస్ అభివృద్ధిని మరచిపోయిందని ధ్వజమెత్తారు. కేవలం హామీలకే పరిమితమైందని ఆరోపించారు. హైదరాబాద్ను నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
పనిలో పనిగా ఎన్నికల సంఘంపై కూడా విరుచుకుపడ్డారు. అధికార పార్టీకి అటెండర్గా ఈసీ మారిపోయిందని మండిపడ్డారు. గత గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదని చెప్పారు. కొత్తగా ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందని ఆయన ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రతీ డివిజన్కు రూ.5 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. గ్రేటర్ అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
మంగళవారం పోలింగ్ జరగనుండగా.. గురువారం 3వ తేదీ అవసరమైన చోట రీ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. ఈ సారి గ్రేటర్ మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కనుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.