రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో వైసీపీ అలా.. టీఆర్ఎస్ ఇలా
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ కూటమిపై తరచూ నిప్పులు చెరిగే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరోసారి అలాంటి వైఖరినే ప్రదర్శించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై సస్పెన్స్కు తెర దించింది. ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటములు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి కోసం అభ్యర్థులను నిలబెట్టినం ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఏ దిశగా అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల మధ్య టీఆర్ఎస్ వైఖరి ఏమిటనేది తేలిపోయింది.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరాన్ని పాటించబోతోంది. ఇందులో భాగంగా ఓటింగ్ దూరంగా ఉంటామని ప్రకటించింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఈ విషయాన్ని వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో పాల్గొనబోమని తెలిపారు. రెండు కూటముల్లోనూ తాము భాగస్వామ్యులం కాదని, అందుకే ఓటింగ్ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు కేకే తెలిపారు. తటస్థంగా ఉంటామని పేర్కొన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ ఎన్డీఏ కూటమికి మద్దతు పలికింది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలకమైన బిల్లుల సమయంలో ఎన్డీఏ వైపే మొగ్గు చూపింది గులాబీ పార్టీ. ఈ సారి ఆ వైఖరిని ప్రదర్శించబోవట్లేదు. జాతీయ భావాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక నిర్ణయాలపై కేంద్రానికి అనుకూలంగా నిర్ణయాలను తీసుకున్నప్పటికీ.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ విషయంలో అలా వ్యవహరించబోవట్లేదని టీఆర్ఎస్ స్పష్టం చేసినట్టయింది.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రేసులో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఎన్డీఏ కూటమి తరపున హరివంశ్ నారాయణ సింగ్, యూపీఏ అభ్యర్థిగా మనోజ్ ఝా బరిలో ఉన్నారు. హరివంశ్ నారాయణ సింగ్ జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన సీనియర్ నాయకుడు. మనోజ్ ఝా.. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి చెందిన నేత. ప్రస్తుతం వారిద్దరూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి కోసం బరిలో ఉన్నారు. మరి కొన్ని గంటల్లో వారిలో ఎవరు విజయం సాధిస్తారనేది తేలిపోనుంది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం ఈ ఎన్డీఏ, యూపీఏలకు లేదు. తటస్థంగా ఉన్న పార్టీల పైనే ఈ రెండు కూటములు ఆశలు పెట్టుకున్నాయి.
ఇదిలావుండగా.. రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఆ పార్టీకి రాజ్యసభలో ఆరుమంది సభ్యుల బలం ఉంది. వీ విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యా రామిరెడ్డి, పరిమల్ నత్వానీ ఎన్డీఏకు అనుకూలంగా ఓటు వేస్తారు. హరివంశ్ నారాయణ్ సింగ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకుంది.