ధరణి పోర్టల్ పై టీఎస్ హైకోర్టు కీలక తీర్పు.!వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే.!
హైదరాబాద్ : వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాల నమోదులో జరుగుతున్న అవతవకలను అరికట్టేందుకు, ప్రజల భూముల సమగ్ర సమాచారం భద్రంగా ఉంచేందకు, ప్రధానంగా భూములు ఆక్రమణకు కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ పట్ల మొదటినుండి ప్రతిపక్షలు సందేహాలను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వ్యవసాయేతర భూములు నమోదు చేసుకుంటే ఎలాంటి భద్రత ఉంటుందనే అంశం పట్ల సందేహాలు నెలకొన్నాయి.ఇదే అంశం పట్ల తెలంగాణ హైకోర్ట్ మంగళ వారం విచారణ చేపట్టింది. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియపై స్టే విధించింది.
తెలంగాణ హైకోర్టలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్ట్ స్టే
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ పై తెలంగాణ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సమగ్ర సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచడంతో పాటు భూములకు సరైన రక్షణ కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా రెవెన్యూ రికార్డుల కోసం రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ పై కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్ట్.
భద్రత పరమైన అంశాలపై స్పష్టత లేదు.. సమగ్ర సమాచారం కావాలన్న కోర్ట్..
ప్రధానంగా వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాల నమోదుపై హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్లో భద్రత పరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రస్తుతానికి ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇదే నిర్ణయం పై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అందుబాటులో ఉన్న మంత్రులతో ఇదే అంశం పట్ల చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
గూగుల్ ప్లే స్టోర్ లో నాలుగు యాప్ లు ఉన్నాయి.. సమస్యలు పరిష్కరించాలన్న కోర్ట్..
అంతే కాకుండా భద్రతపరమైన నిబంధనలు పాటించుకుండా వ్యవసాయేతర భూముల వివరాలు నమోదు చేయడంతో భద్రత పరమైన ఇబ్బందులు తలెత్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. గూగుల్ ప్లే స్టోర్లో ధరణి పోర్టల్ ను పోలిన మరో నాలుగు యాప్స్ ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. దీంతో అసలు ధరణి పోర్టల్ ఏదో తెలిసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని హైకోర్టు తెలిపింది.
ఆస్తుల నమోదులో ఒత్తిడి తేవద్దు.. ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం..
వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన భద్రత పరమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. అంతే కాకుండా రెండు వారాల్లో కౌంటర్ ద్వారా పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకూ వ్యవసాయేతర భూముల ఎలాంటి వివరాలు నమోదు చేయొద్దని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల నుంచి ఆస్తుల వివరాలు నమోదు చేయడంలో ఎలాంటి బలవంతం చేయొద్దన్న కోర్ట్, తదుపరి విచారణ ఈనెల 20 కి వాయిదా వేసింది.