అలాంటివాళ్లే వందేళ్లు బతుకుతారు: మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
''ఒక ఏనుగు నిమిషానికి 9 నుంచి 10 సార్లు శ్వాస తీసుకుని 150 ఏండ్ల దాకా బతుకుతుంది. అదే ఉభయచరమైన తాబేలు.. నిమిషానికి 4 నుంచి 5 సార్లు శ్వాస తీసుకుని ఏకంగా 300 నుంచి 400 ఏడ్లు జీవించగలుగుతుంది. మనతోపాటే జీవించే కుక్కలు ఒక నిమిషానికి 40 నుంచి 50 సార్లు శ్వాస పీల్చుతాయి. కాబట్టి అవి 15 ఏండ్లకంటే ఎక్కువ బతకలేవు. దీన్నిబట్టి జీవుల శ్వాస పీల్చే విధానాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు''అని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పారు.
మామూలు మనుషులకు భిన్నంగా..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం యోగా క్యాంపును ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.. ప్రాణాయామం ప్రాముఖ్యతను వివరిస్తూ ఇచ్చిన స్పీచ్ వైరల్ అయింది. ఇతర జీవులు శ్వాస పీల్చుకునే విధానాన్ని ఉదాహరణగా చెప్పిన మంత్రి మనుషులు నడుచుకోవాల్సిన విధానాల్ని వివరించారు. ‘‘ప్రతీ మనిషి సాధారణంగా నిమిషానికి 20 నుంచి 25 సార్లు శ్వాస తీసుకుంటాడు. అదే ప్రాణాయామం బాగా చేసేవాళ్లైతే నిమిషానికి 12 నుంచి 15 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటారు. అలాంటివాళ్లే వందేళ్లు బతుకుతారు. యోగాలో ఒక భాగమైన ప్రాణయామం వల్ల గాలి ఆహారంగా మారుతుంది. ఆక్సిజనే ఆహారంగా మారినప్పుడు ఆకలి తగ్గిపోతుంది. తద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది'' అని చెప్పారు.
సెల్ ఫోన్ కన్నా.. యోగా మిన్న..
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత సమాజంలో అందరం సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, టీవీలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని, అందులో కొంచెమైనా యోగాకు వెచ్చించగలిగితే నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండగలుగుతామని మంత్రి హరీశ్ సూచించారు. రోగం వచ్చిన తర్వాత డాక్టర్ల చుట్టూ తిరగడం కంటే రోగం రాకుండా తనవును కాపాడుకోవడం ఉత్తమమైన మార్గమని అన్నారు. రెగ్యులర్ గా యోగా, ప్రాణాయామం చేస్తూ తసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలని, లేకుంటే ఔషధాలే ఆహారంగా తీసుకునే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు.
స్కూళ్లలో తప్పనిసరి యోగా
యోగా, ప్రాణాయామం చేయడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో తప్పనిసరిగా యోగా, ప్రాణాయామం క్లాసులు తప్పనిసరి చేయాలని మంత్రి హరీశ్ అన్నారు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో మార్కులు, ర్యాంకులు అంటూ పిల్లల్ని యంత్రాల్లా తయారు చేస్తున్నారని, అలా కాకుండా జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా పోరాడేవాళ్లుగా పిల్లల్ని తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.