అశ్వత్థామరెడ్డి యూటర్న్: ఆర్టీసీ సమ్మె యధాతథం: మళ్లీ మొదటికే వచ్చింది!
ఎట్టకేలకు తెలంగాణ ఆర్టీసీ సమ్మె ముగింపుకు వచ్చిందని భావిస్తున్న సమయంలో..మొత్తం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఎటువంటి కండీషన్లు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ రెండు రోజుల క్రితం ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆ తరువాత ఈ నిర్ణయం మీద ఆర్టీసీ సంఘాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు వెళ్లినా..ప్రభుత్వం నుండి స్పష్టత రాకపోవటంతో వారి అక్కడే పడిగాపులు పడుతున్నారు. దీంతో..మరోసారి సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెను యధాతధంగా కొనసాగించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు. కార్మికులు ఎవరూ డిపోలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పట్టించుకోక పోవటంతోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా అశ్వద్దామ రెడ్డి స్పష్టం చేసారు.
ఆర్టీసీ సమ్మె కేసులో కొత్త ట్విస్ట్: హైకోర్టులో ముగిసిన విచారణ: లేబర్ కోర్టుకి చేరిన పంచాయితీ..!
ఆర్టీసీ సమ్మె యధాతధం..
ముగిసిందనుకుంటున్న ఆర్టీసీ సమ్మె కొనసాగనుంది. సమ్మెను యధాతధంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వధ్దామ రెడ్డి ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఆర్టీసీ సమ్మెను ముగించటా నికి సిద్దంగా ఉన్నామని అశ్వద్దామ రెడ్డి ప్రకటించారు. కార్మికులు డ్యూటీ ఫారంల మీద మినహా మరే సంతకాలు చేయరని..ఎటువంటి కండీషన్లు పెట్టకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అదే విధంగా కార్మి కులకు రావాల్సిన జీతాల గురించి లేబర్ కోర్టులో పోరాడుతామని చెప్పుకొచ్చారు. అయితే, సమ్మె విరమణ నిర్ణయంతో కార్మికులు డిపోల వద్దకు వెళ్లినా..వారికి ఆర్టీసీ యాజమాన్యం నుండి ఆశించిన స్పందన వ్యక్తం కాలేదు. ఇదే సమయంలో కార్మిక సంఘాల్లోనూ సమ్మె విరమణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో..అశ్వద్దామరెడ్డి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
కార్మిక సంఘాల్లో భిన్నాభిప్రాయాలే కారణమా..
రెండు రోజుల క్రితం ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ నిర్ణయం పైన కార్మిక సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఎన్ఎంయూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లేకుండా సమ్మె అర్దాంతరంగా విరమిస్తే..ప్రభుత్వం ముందు పలచన అవుతామని ఆ సంఘ నేతలు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా విధుల్లో చేరమని ఆహ్వానించిన సమయంలోనే సమ్మె ముగించి ఉంటే సరిపోయేదని అభిప్రాయపడ్డారు. తమ సంఘం సమ్మె విరమించటం లేదని స్పష్టం చేసారు. అసలు ఈ సమస్యలకు కారణం అశ్వధ్దామ రెడ్డి అంటూ విమర్శించారు. ఇది కూడా ఇప్పుడు అశ్వద్దామ రెడ్డి యూ టర్న్ తీసుకోవటానికి కారణంగా ప్రచారం సాగుతోంది.
స్పందించని ప్రభుత్వం..
సమ్మె విరమణకు తొలుత జేఏసీ ముందుకు వచ్చింది. ప్రభుత్వం భేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరింది. అయితే, దీని పైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించినా..ఎటువంటి నిర్ణయం మాత్రం తీసుకోలేదు. గత నెలలో ముఖ్యమంత్రి కార్మికులు అయిదో తేదీ లోగా సమ్మె విరమించి విధుల్లో చేరాలని..ఆ సమయంలోనూ తాము ఏ కార్మిక సంఘంతోనూ సంబంధం లేదని లిఖిత పూర్వకంగా రాసివ్వాలని సూచించారు. అయితే, ఆ పిలుపుకు కార్మికులు పెద్దగా స్పందించలేదు. ఇక, ఇప్పుడు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు వెళ్లిన కార్మికులకు ఆర్టీసీ నుండి ఎటువంటి స్పందన కనిపించటం లేదు. డిపోల వద్దే కార్మికులు పడిగాపులు కాస్తున్నారు. అయినా..ముఖ్యమంత్రి నుండి ఆదేశాలు లేకపోవటంతో..ఆర్టీసీ అధికారులు సైతం మౌనం పాటిస్తున్నారు. దీంతో..కార్మికులు అటు కార్మిక సంఘాల నేతలు ..ఇటు ప్రభుత్వం మధ్య ఇబ్బందులు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
కార్మికులు డిపోలకు వెళ్లవద్దు..
తాజాగా సమ్మె యధాతధంగా కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించటంతో.. కార్మికులు ఎవరూ డిపోల వద్దకు వెళ్లవద్దని అశ్వద్దామ రెడ్డి పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమించినా ప్రభుత్వం నుండి స్పందన లేదని ఆరోపించారు. శనివారం సేవ్ ఆర్టీసీ పేరుతో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల వలన ఆర్టీసీకి నష్టం రాలేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే తాము సమ్మె కొనసాగించాల్సి వస్తోందని స్పష్టం చేసారు. శనివారం జేఏసీ మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తుందని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.