టీయస్ఆర్టీసీ సమ్మె నేటితో ముగిసేనా..! ప్రకటన దిశగా జేఏసీ: ప్రభుత్వం సైతం..ఆ కండీషన్ తో..!
తెలంగాణలో 46 రోజులుగా సాగుతున్న టీయస్ఆర్టీసీ సమ్మెకు మంగళవారంతో తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మె ప్రారంభం నుండి అటు ప్రభుత్వం..ఇటు కార్మిక జేఏసీ నేతలు పట్టు వీడకుండా ఎవరికి వారు ఒత్తిడి పెంచే వ్యూహాలు అమలు చేసారు. హైకోర్టులో రెండు పక్షాలు సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించాయి. కానీ, కోర్టు తమ పరిధిని ప్రస్తావిస్తూ..కార్మిక శాఖకు కేసును అప్పగించింది. ఇదే సమయంలో ప్రభుత్వం ప్రయివేటు పర్మిట్లు జారీ దిశగా అడుగులు వేస్తోంది. మరో వైపు పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సెప్టెంబర్ జీతాలే అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. ఎక్కవ కాలం సమ్మె కొనసాగిస్తే నష్టపోతామని..కొంత సడలింపు ఇచ్చి..ఆ తరువాత భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలనే ఉద్దేశంతో జేఏసీ నేతలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వం సైతం వేచి చూసే ధోరణితో ఉంది. ఈ సాయంత్రానికి ఈ మొత్తం వ్యవహారం మీద స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
హైకోర్టులో నేడు తేలిపోనుందా: ప్రభుత్వం తాజా అఫిడవిట్ లో ఇలా :టీయస్ఆర్టీసీ బకాయిలు రూ.2,209 కోట్లు
సమ్మె విరమణ దిశగా ఆలోచన..!
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విషయం పైన కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన నేతలు..ఇప్పుడు హైకోర్టు పరిష్కార బాధ్యతలను కార్మిక శాఖకు అప్పగించింది. దీంతో..దీని పైన జేఏసీ నేతలు సమావేశమై అనేక అంశాల పైన చర్చించారు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని పూర్తిగా పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మంగళవారం నిర్వహించాలని నిర్ణయించిన సడక్ బంద్ ను ఉప సంహరించుకున్నారు. ఇదే సమయంలో మరింత కాలం సమ్మె కొనసాగిస్తే ..కార్మికులు మరింతగా నష్టపోతారనే అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో..దీని పైన సమ్మెలో ఉన్న యూనియన్లు..నేతల అభిప్రాయాలు సేకరించి..తుది నిర్ణయం తీసుకొనే దిశగా జేఏసీ అడుగులు కనిపిస్తున్నాయి. సమ్మెను తాత్కాలికంగా విమరణ చేస్తూ..ఆ తరువాత భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
కార్మికుల్లో పెరుగుతున్న ఆందోళన..
ఆర్టీసీ సమస్యల పైన తాము ఇన్ని రోజులు పోరాటం చేస్తున్నా..ప్రభుత్వం ఎక్కడా పరిష్కార దిశగా ఆలోచన చేయకపోవటం పైన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం పైనా ఆవేదనతో ఉన్నారు. సమ్మె ప్రారంభం కాకముందు తాము విధులు నిర్వహించినా..సెప్టెంబర్ మాసానికి సంబంధించిన వేతనం ఇప్పటికీ చాలా మందికి అందలేదు. ఇక, అక్టోబర్..నవంబర్ లో ఈ రోజు వరకు విధులు నిర్వహించలేదు. దీంతో..కార్మికుల ఆర్దిక సమస్యలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో సామాన్య ప్రజలు 46 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టులో ఇప్పటి వరకు ఉన్న అంశం..ఇప్పుడు కార్మిక న్యాయస్థానం పరిధిలోకి ఈ అంశం వెళ్లిన నేపథ్యంలో సమ్మె కొనసాగించాలా.. వద్దా అనే మీమాంస నేతల్లో కనిపిస్తోంది. ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం అత్యవసర సమా వేశం ఏర్పాటు చేసింది.
కార్మిక శాఖ వద్ద పరిష్కారం పైనా..
హైకోర్టులో సుదీర్ఘ వాదనలు సాగినా..చివరకు కార్మిక శాఖ వద్దకు సమస్య చేరింది. అక్కడ తమకు అనుకూలంగా ఉంటుందా..లేదా అనే అంశం పైన జేఏసీ నేతలు న్యాయవాదులతో చర్చించారు. కార్మిక కమిషనర్ వద్ద పరిష్కారం లభించకపోతే..ట్రిబ్యునల్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అక్కడ ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తాము కార్మికుల కోసమే..ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని పదే పదే ప్రభుత్వాన్ని కోరినా..ఫలితం కనిపించ లేదని..ఇక ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టు సూచనల ద్వారా మరింతగా పట్టు బిగించే అవకాశాలు ఉన్నాయని నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..కోర్టు ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేసిన సమయంలోనే తాము... సమ్మెకు తాత్కాలిక ముగింపు ఇస్తే...కార్మికులకు మరింత నష్టం కలగకుండా ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొంద వచ్చని ఆశిస్తున్నారు. దీంతో..తుది నిర్ణయం పైన కార్మిక సంఘాల నేతలు అంతర్గతంగా చర్చించనున్నారు. అనంతరం జేఏసీ భేటీలో ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నారు.
Recommended Video
వేచి చూసే ధోరణిలో ప్రభుత్వం..
ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె మొదలైన నాటి నుండి ఎక్కడా మెట్టు దిగలేదు. స్వయంగా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని పర్యవేక్షించారు. కార్మిక సంఘాల నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. ఇక, కోర్టులోనూ ఎక్కడా తమ వాదనల్లో పస తగ్గకుండా సీఎం జాగ్రత్తగా మార్గదర్శకం చేసారు. ఇప్పుడు హైకోర్టు తాజా నిర్ణయం తో కార్మిక సంఘాల నేతలు ఒక విధంగా ఆత్మరక్షణలో పడ్డారు. కార్మికులకు సమాధానం చెప్పుకో వాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే సమయంలో హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. 48 వేల కుటుంబాలను రోడ్డున పడేయకుండా విశాల మనస్సు ఉన్న యజమానిగా వ్యవహరించాలని సూచన చేసింది. అటు ప్రభుత్వం సైతం కార్మిక సంఘాల నేతలను పక్కన పెట్టి కార్మికులు విధుల్లోకి వస్తే అనుమతించేందుకు సిద్దంగా ఉంది. అయితే, కార్మిక సంఘాలత సంబంధం లేదని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన తరువాత విధుల్లోకి తీసుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మంగళవారం సాయంత్రానికి ఈ వ్యవహారం పైన ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.