రాష్ట్రాలుగా విడిపోయాం కానీ.. : టీఎస్ఆర్టీసీ సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు, కేసీఆర్ సర్కారుపై ఫైర్
హైదరాబాద్: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ 25 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) మద్దతు తెలిపింది. మంగళవారం విద్యానగర్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ ఆర్టీసీ కార్మిక నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే..
ఏపీలో అమలు చేస్తోన్న విధానాలను తెలంగాణలోనూ అమలు చేయాలని జేఏసీ నేత థామస్ రెడ్డి కోరారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూ.. కేంద్ర మోటారు వాహన చట్టం పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదుకుంటామని మాటిచ్చి.. ఆర్టీసీని ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
ఆయనకు ఏడు రోజులపాటు నేనే డ్రైవర్ను: తిరునక్షత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరిక
ప్రజా రవాణాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తున్నారో.. లేదో ఉన్న అప్పులను బట్టే తెలుస్తోందని అన్నారు. ఆర్టీసీ ఆస్తులన్నీ అన్యాక్రాంతమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటీకరణ చేసేదిశగా తెలంగాణ ఆర్టీసీ వెళ్తుండటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నష్టం ఏంటని థామస్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుపరమైతే మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
అప్పుడే లాభాలు వస్తాయి..
ఈ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పల్లె వెలుగు బస్సులన్నీ ప్రభుత్వ అజమాయిషీలోనే నడుస్తున్నాయని, ప్రభుత్వం చెప్పినట్లు బస్సుల్ని నడిపిస్తే నష్టం వస్తోందని తెలిపారు. ఆ నష్టాన్ని ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ఆర్టీసీ సంస్థకు స్వయం ప్రతిపత్తి ఇస్తే లాభాలు వచ్చేలా నడిపిస్తామని అన్నారు.
ఇదేమైనా పోలీస్ రాజ్యమా?
25 రోజులుగా జరుగుతున్న తమ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. బుధవారం చేపట్టే భారీ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, శాంతియుత పోరాటాలను కూడా ఇలా అణిచివేస్తారా? అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వమా లేక ఇది పోలీస్ రాజ్యమా? అని థామస్ రెడ్డి కేసీఆర్ సర్కారును నిలదీశారు.
రాష్ట్రాలుగా విడిపోయినా..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా ఆర్టీసీ ఆస్తులు, రూట్ల పంపకాలు ఇంకా జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు ఆర్టీసీ తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఏపీఎస్ఆర్టీసీలో చేపట్టిన సంస్కరణలను తెలంగాణలో కూడా అమలు చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి డిమాండ్లు సాధించుకోవాలన్నారు.