టీఎస్ఆర్టీసీ సమ్మె, అశ్వత్థామ రెడ్డి అరెస్ట్... దీక్ష భగ్నం
ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం ఉదయం నుండి తన ఇంటివద్దే నిరవధిక దీక్ష చేస్తున్న జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఆయన ఇంటివద్ద ఉన్న మద్దతుదారులను బయటకు పంపించి ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కార్మికులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతవరణం నెలకొంది.
బీఎన్రెడ్డి నగర్లో అశ్వత్థామ రెడ్డి దీక్ష
ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం నుండి సాముహిక దీక్షలు చేపట్టాలని జేఏసీ పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా వాటిని ప్రారంభించేందుకు ఉద్యోగులు సన్నద్దమయ్యారు. దీంతో కార్మికులు చేపట్టే దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు వాటిని భగ్నం చేసే ప్రయత్నం కూడ చేశారు. దీక్షలు చేస్తున్నవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హైదరాబాద్ లోని బీఎన్ రెడ్డి నగర్లోని తన ఇంట్లో నిరవధిక దీక్షకు దిగారు. ఆయన ఇంటివద్ద ఉద్రిక్త వాతవరణం నెలకొంది.
రెండు రోజుల దీక్ష భగ్నం
కాగా ఉదయం నుండి ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పలుసార్లు యత్నించారు... ఇందుకోసం ఇంటి తలుపులను మూసిన పోలీసులు మద్దతుదారులు ఎవ్వరు రాకుండా కట్టడి చేస్తూ వచ్చారు. దీక్షను భగ్నం చేసి... అరెస్ట్ చేస్తే... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక అశ్వాత్థామా రెడ్డి ఆరోగ్యం కూడ క్షీణించడంతో బలవంతంగానైనా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
నేతల అరెస్ట్...
మరోవైపు దీక్ష చేస్తున్న మరో కార్మిక నేత జేఏసీ కో కన్వినర్ రాజీరెడ్డిని దీక్షను కూడ భగ్నం చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇక దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పలువురు నేతలను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో మందక్రిష్ణ మాదిగతోపాటు, బీజేపీ నేతలు మాజీ ఎంపీ జితెందర్ రెడ్డిలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసినా తమ డిమాండ్లు నెరవేరే వరకు దీక్షను కొనసాగిస్తామని కార్మిక నేతలు తెలిపారు. కార్మికులు ఎక్కడికక్కడ దీక్షలు చేస్తున్నారని తెలిపారు. కాగా అరెస్ట్ చేసిన నేతలను ఎక్కడి తీసుకువెళ్లారనేది సమాచారం లేదు. దీంతో కుటుంబసభ్యులు ఆరా తీస్తున్నారు.
సోమవారం సడక్ బంద్..
సమ్మె కార్యచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. దీంతో సడక్ బంద్కు తెలంగాణాలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు తెలిపారు. మద్దతు తెలపడంతో పాటు స్యయంగా పాల్గోంటామని ప్రకటించారు. దీంతో అన్ని డిపోల్లో బస్సులు బయటకు వెళ్లకుండా ధర్నాలు, రాస్తారోకోలు చేయనున్నారు. అయితే నేతల అరెస్ట్ తో సడక్ బంద్పై ఏమేరకు ప్రభావం పడనుందో వేచి చూడాలి.