కోర్టు తీర్పులను ఖాతరు చేయరా.. కేసీఆర్ సర్కార్పై అశ్వత్థామ రెడ్డి నిప్పులు
తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఆర్టీసీ జేఏసీ తప్పుపట్టింది. సమస్యల కోసం సమ్మె బాట పట్టి పద్నాలుగు రోజులవుతున్న పట్టించుకోవడం లేదని మండిపడింది. కోర్టు తీర్పులను కూడా సర్కార్ ఖాతరు చేయడం లేదని ఆరోపించింది. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని జేఏసీ కన్వీనర్ అశ్వతామరెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని సాకులు చెపుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఫైరయ్యారు.
సమ్మె సమస్యను పరిష్కరించమని హైకోర్టు ఆదేశించిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందని మండిపడ్డారు. కోర్టులంటే కూడా కేసీఆర్ సర్కార్కు లెక్కలేదని విమర్శించారు. అప్పుల పేరుతో కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని అశ్వతామరెడ్డి అన్నారు. ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం వెల్లడించడం లేదన్నారు. కానీ కల్లబొల్లి కబుర్లు చెప్తుందని విమర్శించారు.
ఆర్టీసీలో 50 శాతం ప్రైవేట్ బస్సులు ప్రవేశపెట్టడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆర్టీసీని కాపాడుతామంటునే ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టడం సరికాదన్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ సంరక్షణకు చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఇన్నాళ్లు ఎందుకు ఆ పని చేయలేదని అడిగారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని మాట ఇవ్వలేదా అని కేసీఆర్ను ప్రశ్నించారు. మాట ఇచ్చి కూడా అనలేదని అనడం సమంజసం కాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె బాట పట్టామని పేర్కొన్నారు. కార్మికులకు పోరాటం కొత్త కాదని స్పష్టంచేశారు.