ఆర్టీసీ సమ్మె ఉధృతం.. సర్కార్ డెడ్లైన్ బేఖాతరు.. ఎక్కడికక్కడే అరెస్టులు
తెలంగాణ ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకే పట్టుపడుతున్నారు. నెలరోజులుగా జరుగుతున్న సమ్మెను ముందుకు తీసుకెళ్లడానికి టీఎస్ఆర్టీసీ నేతలు కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. కాగా టీఎస్ ఆర్టీసీ సమ్మెకు వామపక్షాలు మద్దతు పలికారు. హైదరాబాద్లో ధర్నాకు దిగుతున్న పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్ర రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే..
సీఎం కేసీఆర్ డెడ్ లైన్ కు స్పందన లేనట్టే .. రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరిన ఆర్టీసీ ఉద్యోగులు 360
ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతరు
ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు, ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. నవంబర్ 5వ తేదీ వరకు విధించిన డెడ్లైన్ దాటిన తర్వాత నవంబర్ 6వ తేదీన కీలక నిర్ణయం తీసుకొంటామని సీఎం పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉద్యోగులు సమ్మెకే మొగ్గు చూపడంతో తీవ్రమైన నిర్ణయం తీసుకొనేందుకు సర్కార్ ముందుకెళ్తుందనే సమాచారం మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
వందల సంఖ్యలోనే చేరికలు
తెలంగాణ ప్రభుత్వ హెచ్చరికల తర్వాత మంగళవారం నాటికి 49,733 ఉద్యోగులు, కార్మికుల్లో కేవలం వందల సంఖ్యలోనే విధుల్లో చేరినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో సమ్మెపై హైకోర్టు 7వ తేదీన విచారణ చేపట్టనుండటంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంపైనే రాజకీయ, సామాజిక వర్గాలు వేచి చూస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
సీఎం కేసీఆర్ డెడ్లైన్ లెక్క చేయకుండా ఉద్యోగులు బుధవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నగరంలోని హయత్ నగర్, తదితర డిపోల వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అయితే ఉద్యోగులను, నేతలను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకొంటూ ఉద్రిక్త పరిస్థితులను నివారించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో టీఎస్ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది. రానున్న రోజులు పరిస్థితులు తీవ్రతరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
లెఫ్ట్ పార్టీల నేతల మద్దతు
ఇదిలా ఉండగా, తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ వామపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఐ నేత నారాయణ, చాడ వెంకట్రెడ్డి, పద్మను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై సీపీఐ నేత నారాయణ నిప్పులు చెరిగారు. ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆయన విమర్శించారు.