ఉద్యమంతో గెలిచి, పోరాటాలను అణిచి.. విద్యాసంస్థల సెలవుల పొడిగింపు అందుకేనా..!
Recommended Video
హైదరాబాద్ : ఉద్యమ స్ఫూర్తితో మహా నేతగా ఎదిగారు. ఉద్యమ నేతగా బలపడి తిరుగులేని రాజకీయ వేత్తగా మారారు. తెలంగాణ ఉద్యమంలో బక్కపలుచని మనిషిగా ముద్రపడ్డ కేసీఆర్.. తర్వాత కాలంలో బలమైన వ్యక్తిగా తయారయ్యారు. కేసీఆర్ మాటల ధాటికి కౌంటర్ ఇవ్వలేని తీరుగా.. అసలు ప్రతిపక్షం మాట లేని వ్యవహారంగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, కళాకారులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు.. ఇలా ప్రతి ఒక్కరి పాత్ర ఉందనేది అందరికీ తెలిసిందే.
ఉద్యమం నుంచి వచ్చి ఉద్యమ నేతగా బలపడి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేయాలని చూయడం దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ నేతలు తలపెట్టిన తెలంగాణ బంద్ సక్సెస్ కావొద్దనే కారణంతోనే విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించారనే వాదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఉద్యమం నుంచి ఎదిగి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001, ఏప్రిల్ 7వ తేదీన ఉద్యమ పార్టీగా అవతరించింది టీఆర్ఎస్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకే ఒక్కడిగా మొదలైన ఉద్యమ ప్రస్థానం తదనంతర పరిణామాలతో వేగం పుంజుకుంది. ఆ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయ శక్తిగా అవతరించింది. కేసీఆర్ వాగ్ధాటికి తెలంగాణ ప్రజానీకం నరనరాల్లో రాష్ట్ర ఆవిర్భావ నాదం ఇంకిపోయింది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అండగా నిలవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అంకురార్పణ జరిగింది. ఆ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నీ శక్తులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉరకలెత్తించారు కేసీఆర్. ఇక 2004 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడంతో టీఆర్ఎస్కు చెందిన 26 ఎమ్మెల్యేలను అసెంబ్లీకి.. ఐదుగురు ఎంపీలను పార్లమెంటుకు పంపించారు ప్రజలు.
సీఎం రాకపాయే.. ఆర్టీసీ సమ్మెపై ఏం మాట్లాడకపాయే.. కేసీఆర్ సభకు వరుణిడి బ్రేక్..! మరి ఆనాడు..!!
ఆనాడు కేసీఆర్కు అండగా ఎందరో
2009లో విద్యార్థులను, ఉద్యోగులను, ప్రజా సంఘాలను, కళాకారులను అందరిని ఏకం చేసి నవంబర్ 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు కేసీఆర్. ఆ నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజానీకం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ క్రమంలో 10 రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడడంతో ఎక్కడికక్కడ అంతా స్తంభించిపోయింది. నిరాహార దీక్షతో ఉద్యమ సారథి కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆ సమయంలో ఆఘమేఘాల మీద 2009, డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. అయితే సీమాంధ్ర నేతల లాబీయింగ్తో రెండు వారాల్లోనే యూపీఏ ప్రభుత్వం మాటమార్చడం గమనార్హం.
రాజకీయ శక్తిగా ఎదిగిన క్రమం
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లే పూర్తయి చేజారిపోయింది. ఆ క్రమంలో మరోసారి రాజకీయ శక్తులతో పాటు పలువుర్ని ఏకతాటి పైకి తెచ్చి తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేశారు కేసీఆర్. దాని తర్వాత మరో నాలుగేళ్ల పాటు ఉద్యమం ఉద్రిక్తంగా సాగింది. ఆ నేపథ్యంలో తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగం, ఉద్యమం ఉరకలెత్తడం వెరసి 2013 జులైలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోద ముద్ర పడింది. అలా ఉద్యమంలో కీ రోల్ పోషించిన టీఆర్ఎస్ పార్టీకి 2014లో జరిగిన సాధారణ అసెంబ్లీలో ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు ప్రజలు. 119 స్థానాలకు గాను 63 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరింది. అలా 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్కే జై కొట్టింది తెలంగాణ ప్రజానీకం.
టీఆర్ఎస్ ప్రస్థానంలో సహకరించిన వారెందరో..!
అదంతా టీఆర్ఎస్ ప్రస్థానం. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి అన్నీ వర్గాలు కేసీఆర్కు సహకరించాయి. విద్యార్థులు, కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ వెంట నడిచారు. బక్క పలుచని మనిషిగా ముద్రపడ్డ కేసీఆర్ అలా ఉద్యమ నేపథ్యం నుంచి ఈనాడు రాజకీయ శక్తిగా ఎదిగారు. ఆనాడు ఆయన చేపట్టిన ఉద్యమానికి ఎవరూ సహకరించకపోతే ఈనాడు తెలంగాణ రాష్ట్రం భారతదేశ పటంలో కనిపించేది కాదేమో. మరి ఆనాడు ఉద్యమానికి అండగా నిలిచిన ఆర్టీసీ కార్మికులు ఈనాడు న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కితే చర్చల్లేవ్ అంటూ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా మాట్లాడటం దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఆర్టీసీ కార్మికుల బాటలో క్యాబ్ డ్రైవర్లు.. 19 నుంచి నిరవధిక సమ్మె.. డిమాండ్లు ఇవే..!
ఈనాడు ఆర్టీసీ సమ్మెను నీరుగార్చడానికి సెలవులు పొడిగింపా?
ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఈ నెల 19వ తేదీ (శనివారం) నాడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు జేఏసీ నేతలు. ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో బంద్కు సిద్ధమయ్యారు. అయితే బంద్ ప్రకటించిన మరునాడే సీఎం కేసీఆర్ విద్యాసంస్థలకు దసరా సెలవులు 19 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలు తెరిచి ఉంటే విద్యార్థులు ఎక్కడ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలుస్తారోననే ఇంటెన్షన్తోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. విద్యాసంస్థలు మూసి ఉంటే ఆర్టీసీ సమ్మెను దెబ్బ తీయొచ్చనే కారణంతోనే కేసీఆర్ ఇలా ఎత్తుగడ వేశారనే ప్రచారం జరుగుతోంది. ఆనాడు విద్యార్థులను, విద్యార్థి సంఘాల నేతలను ఉద్యమంలో పావులుగా వాడుకున్న కేసీఆర్.. ఈనాడు ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఇలా ప్రవర్తిస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది.