TSRTC Strike: కేసీఆర్ మెగా ప్లాన్..ఎమ్మెల్యే, ఎంపీలకు కొత్త బాధ్యతలు, సక్సెస్ ఐతే ఇక అంతే!
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ ఎమ్మెల్యేలకు మరో కొత్త బాధ్యతలను అప్పగించారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు అంటే ఆర్టీసీకి ముగింపు పలకడమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు సమ్మె చేస్తున్న కార్మికులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
TSRTC Strike: ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: అశ్వద్ధామ రెడ్డి స్పందన ఇది
కేసీఆర్ పిలుపు...
ఆర్టీసీ కార్మికులు యూనియన్ల నేతల మాయలోపడి తమ ఉద్యోగాలతోపాటు సంస్థ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఇప్పటికే కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కార్మికులు తమ గురించి, తమకు ఆధారాన్ని కల్పిస్తున్న సంస్థను కాపాడుకునేందుకు సమ్మె నుంచి బయటకు రావాలంటూ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే, ఎంపీలకు కొత్త బాధ్యతలు..
ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ కొత్త బాధ్యతలను అప్పగించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకువచ్చే బాధ్యతను వారి భుజాలపై పెట్టారు. సమ్మె విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆర్టీసీ సంఘాలు ఓ వైపు వ్యాఖ్యానిస్తుంటే.. కేసీఆర్ మాత్రం కార్మికులపై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే రంగంలోకి దిగారు..
తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు, కీలక నేతలు తమ పరిధిలోని ఆర్టీసీ డిపోలకు చెందిన కార్మికులు, కార్మిక సంఘాల స్థానిక నేతలతో చర్చలు జరిపి.. వారిని ఎలాగైనా విధుల్లోకి చేర్చేలా ఒప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అధినేత ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు కార్మికులతో చర్చలు జరుపుతున్నారు.
సమ్మెకు ముగింపేనా..?
సమ్మె చేస్తున్న కార్మికుల్లో కొంత మందిని విధుల్లో చేరేలా చేసినా.. పూర్తి సమ్మెపై ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా సమ్మెకు ముగింపు పలకాలనే ప్రణాళికలో ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జరిపే చర్చలకు ఆర్టీసీలోని కొందరు సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం.
కేసీఆర్ మెగా ప్లాన్..
ఇప్పటికే కూకట్పల్లి డిపోకు చెందిన రాజు అనే డ్రైవర్.. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టించి సమ్మె చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక, ఆయన విధుల్లో చేరడం గమనార్హం. ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతోపాటు మరోవైపు ఆర్టీసీ అధికార యంత్రాంగాన్ని కూడా రంగంలోకి దించి ఆర్టీసీ సమ్మెను ముగించేందుకు సీఎం కేసీఆర్ భారీ ప్రణాళికతోనే ముందుకు సాగుతుననట్లు తెలుస్తోంది.