TSRTC STRIKE:ఆర్టీసీ ఆర్థికపరిస్థితిపై యాజమాన్యం అఫిడవిట్, తప్పులతడక అన్న హైకోర్టు..
ఆర్టీసీ స్థితిగతులపై యాజమాన్యం హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టు ధర్మాసనానికి అఫిడవిట్ అందజేశారు. దీనిని ధర్మాసనం 25 నిమిషాల పాటు క్షుణ్ణంగా పరిశీలించింది. అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని మండిపడింది. ఆర్టీసీకి రావాల్సిన గ్రాంట్లను అప్పుల రూపంలో ఎలా చూపిస్తారని ఇంచార్జీ ఎండీని ప్రశ్నించింది.
ఆర్టీసీ రణం ..చర్చలు మొదలుపెట్టాకే ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్య క్రియలన్న భార్య జయ.. జేఏసీ ప్రతిన
ఇదీ అఫిడవిట్..
ఆర్టీసీ ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టుకు అఫిడవిట్ అందజేశారు. అందులో అప్పులు, ఆస్తులు, గ్రాంట్ల వివరాలను పొందుపరిచారు. అఫిడవిట్ పూర్తిగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. సునీల్ శర్మ వైఖరిని తప్పుపట్టింది. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లను అప్పుల రూపంలో ఎలా చూపిస్తారని ప్రశ్నించింది. అఫిడవిట్లో తప్పులు ఏంటి అని నిలదీసింది.
644 కోట్లు ఇచ్చాం..
ఆర్టీసీకి 2018-2019 ఏడాదికి సంబంధించి 644 కోట్ల రాయితీ సొమ్మును ప్రభుత్వం చెల్లించిందని సునీల్ శర్మ పేర్కొన్నారు. సిటీలో బస్సులు నడుపుతున్నందుకు జీహెచ్ఎంసీని రూ.1700 కోట్లు ఇవ్వాలని ఆర్టీసీ కోరింది. అయితే రూ.336 కోట్లు ఇచ్చి జీహెచ్ఎంసీ చేతులు దులుపుకుంది. మిగిలిన సోమ్ముకు సంబంధించి చెల్లించలేమని, ఆర్థిక స్థోమత లేదని ప్రభుత్వానికి విన్నవించింది. సెక్షన్ 132, సబ్ సెక్షన్ కింద బకాయిని ఆర్టీసీకి బల్దియా చెల్లించాలి.. కానీ ఇప్పటివరకు అందజేయలేదని వివరించారు.
అప్పులు ఎందుకంటే..
ఆర్టీసీ నిర్వహణ వ్యయం వల్లే అప్పుల కుప్పగా మారిందని సునీల్ శర్మ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడంతో రూ.82 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. అఫిడవిట్, అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న ధర్మాసనం.. యాజమాన్యం వైఖరిని తప్పుపట్టింది. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ప్రశ్నించింది. గ్రాంట్లను అప్పులుగా చూపిస్తున్నారని పేర్కొన్నది. సమ్మె ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన ఆదాయ, వ్యయాల్లో తేడా ఉందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
వీడని ప్రతిష్టంభన...
గత 28వ రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిమాండ్లపై కార్మికులు మెట్టుదిగకపోవడం, ప్రభుత్వం పట్టువీడకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. 26 డిమాండ్లలో 21 డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించింది. అయితే ఐదు డిమాండ్లలో ఆర్టీసీ విలీనం, ఐఆర్, పీఆర్ లాంటి ముఖ్యమైన అంశాలు ఉండటంతో కార్మిక నేతలు పట్టుబడుతున్నారు. ఆర్థికభారం లేని డిమాండ్లను తీరుస్తామని యాజమాన్యం స్పష్టంచేసింది. మరోవైపు వేతనాలు లేక ఆర్టీసీ కార్మికులు గుండెలు ఆగిపోతున్నాయి.