TSRTC STRIKE : ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ వీడియో కాన్ఫరెన్స్ .. ఎందుకంటే
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిపై రోజు రోజుకూ ఉద్యమం ఉధృతం అవుతుంది. నేడు ప్రగతి భవన్ ముత్తడ్కి యత్నించారు కాంగ్రెస్ నేతలు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ సమ్మె 17వ రోజుకు చేరటంతో సమ్మె ఉధృత రూపం దాల్చింది. కార్మికులకు మద్దతుగా వివిధ రాజకీయ పక్ష నేతలు, విద్యార్థి, ప్రజా సంఘాలు అండగా పోరాటం సాగిస్తున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చిన నేపధ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను కట్టడి చేసే క్రమంలో హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
TSRTC STRIKE : 13వ రోజు .. సమ్మె విరమించేది లేదన్న జేఏసీ .. చర్చించేది లేదంటున్న సర్కార్
ఇక ఈ రోజు నుండి స్కూళ్ళు , కాలేజీలు తెరుచుకున్నాయి. మరో పక్క సమ్మె కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో తాజా పరిస్థితులను సమీక్షించటానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ జిల్లా కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యాసంస్థల పునఃప్రారంభం తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు కూడా చేశారు.ఇక రవాణా వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందిలేదని అధికారులు మంత్రికి వివరించినట్టు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,228 బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ అధికారులు మంత్రి పువ్వాడకు వివరించినట్టు సమాచారం. ఇక రంగారెడ్డిలో అత్యధికంగా 98 శాతం, హైదరాబాద్లో అత్యల్పంగా 43 శాతం, సికింద్రాబాద్లో 46 శాతం బస్సులు నడుస్తున్నాయని మంత్రి పువ్వాడకు అధికారులు చెప్పారు .
ఇక నేటి నుండి విద్యాసంస్థలు యధావిధిగా నడుస్తున్న నేపధ్యంలో బస్సుల సంఖ్యా పెంచాలని అధికారులను ఆదేశించారు రావానా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో వాస్తవానికి ఈ నెల 14 నుంచే విద్యా సంస్థలు ప్రారంభం కావాల్సి ఉన్నా విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారం రోజులపాటు సెలవులను పొడిగించింది. ఈ లోపు ఆందోళన తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం భావించింది.
కానీ ఆర్టీసీ కార్మికుల ఆందోళన రోజు రోజుకూ పెరుగుతుంది. ఇక విధిలేని స్థితిలో విద్యా సంస్థల కొనసాగింపుకు నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతుండడంతో విద్యార్థులు అవసరాలకు తగినట్టుగా బస్సుల సంఖ్యను తక్షణమే పెంచాలని మంత్రి అజయ్ ఆదేశించారు. తాత్కాలిక సిబ్బందిని పెంచాలని పేర్కొన్నారు. మరిన్ని బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిపో మేనేజర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు.