TSRTC Strike: సీఎం ఆఫర్పై అసదుద్దీన్ ఓవైసీ స్పందన: కేసీఆర్కు కీలక సూచన
హైదరాబాద్: సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5 అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలని, అలా చేస్తే తాము వారికి రక్షణ కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్టీసీలో సగం బస్సులను ప్రైవేటు వాళ్లకు ఇచ్చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
TSRTC Strike: చివరి అవకాశం: నవంబర్ 5 డెడ్లైన్, కేసీఆర్ కీలక నిర్ణయాలు
సీఎం మాటలు ఆలకించాలంటూ..
నవంబర్ 5 లోపు విధుల్లో చేరాలంటూ కార్మికులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని.. సీఎం మాటలు ఆలకించి కార్మికులందరూ విధుల్లో చేరాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. యూనియన్ నాయకులు, కాంగ్రెస్, బీజేపీ, విపక్షాల ఉచ్చులోపడి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు.
ఆత్మహత్యలు వద్దంటూ..
‘కార్మికుల బాధను అర్థం చేసుకోగలను. కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. తొందరపడి బలవన్మరణాలకు పాల్పడవద్దు. సీఎం కేసీఆర్ మాటలను ఆలకించాలని కోరుతున్నా' అని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ను సమస్యపై చర్చించాలని కోరారు.
ఆ అక్షరాన్ని మాత్రం తొలగించొద్దు..
అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్కు కూడా ఓ కీలక సూచన కూడా చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా? లేదా? అనే విషయంపై సీఎం కేసీఆరే నిర్ణయం తీసుకుంటారన్నారు. ఒకవేళ కొంత వరకు ప్రైవేటీకరణ చేసినప్పటికీ బస్సుల నెంబర్ ప్లేట్లపై ఉండే ‘z' అనే అక్షరాన్ని మాత్రం తొలగించవద్దని కోరారు.
హైదరాబాద్ చరిత్రలో భాగం..
నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా పేరు మీద ఆ అక్షరాన్ని పొందుపర్చారని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ నెంబర్ ప్లేట్లలో ‘z' అనే అక్షరం హైదరాబాద్ చరిత్రలో భాగమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘z' అక్షరాన్ని తీసేయవద్దని మరోసారి కోరారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాగా, శనివారం రాత్రి మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. నవంబర్ 5లోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని, ఇదే చివరి అవకాశమని చెప్పారు. విధుల్లో చేరిన వారికి రక్షణ కల్పిస్తామని, చేరని ఉద్యోగులతో ఇక ఆర్టీసీ సంస్థతో సంబంధాలు తెగిపోయినట్లేనని స్పష్టం చేశారు.