బ్లేడుతో కోసుకుని మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం: పరిస్థితి విషమం
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పదిరోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోనే కొనసాగుతూ తమ ఆందోళనలనను, నిరసనలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. అంతేగాక, సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన పలువురు కార్మికుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ఆ ఒక్కటీ తప్ప! ప్రభుత్వంతో చర్చలకు రండి: ఆర్టీసీ సంఘాలకు కేకే పిలుపు, అశ్వద్ధామరెడ్డి ఏమన్నారంటే?
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మంకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లో సురేందర్ గౌడ్ అనే కండక్టర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. నర్సంపేటలో మరో డ్రైవర్ కూడా ఆత్మహత్యాత్నం చేశాడు. తాజాగా, హైదరాబాద్ నగరంలో మరో కండక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సోమవారం మధ్యాహ్నం హెచ్సీయూ డిపో ఎదుట ఆర్టీసీ బస్ కండక్టర్ సందీప్ బ్లేడుతో కోసుకున్నారు. గమనించిన తోటి కార్మికులు వెంటనే అతడ్ని కొండాపూర్లోని ఆస్పత్రికి తరలించారు. సందీప్ పరిస్థితి కాస్త విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని మేధావులు, సామాజికవేత్తలు చెబుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
ఇప్పటికే తెలంగాణలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ ఉద్యోగాలు పోతున్నాయనే బాధతో ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ పెట్రోల్ సోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని కార్వాన్లో ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ ఇంట్లో ఉరివేసుకుిన ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్మికులెవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు.
ఇది ఇలావుంటే, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఓ ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా కార్మికులు లేవనెత్తిన మిగితా డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తమను తీవ్రంగా బాధించాయని, బలిదానాలు సమస్యలకు పరిష్కారం కాదని కేశవరావు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉందని తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థల విలీనమంటే విధి విధానాలను మార్చుకోవాలని కోరడమేనని కేశవరావు అన్నారు. విధాన పరమైన నిర్ణయాల్లో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఎవరూ శాసించలేరని వ్యాఖ్యానించారు. తాను టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ కమిటీకి ఛైర్మన్గానూ వ్యవహరించానని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో లేదని స్పష్టం చేశారు.