TSRTC STRIKE:సమర భేరీ మోగించిన ఆర్టీసీ జేఏసీ, సీఎం కేసీఆర్పై రేవంత్ నిప్పులు,శెభాష్ అన్న మందకృష్ణ
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరికాదని విపక్ష నేతలు మండిపడ్డారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టిన కార్మికులను బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సకల జనుల సమర భేరీ సభలో నేతలు మాట్లాడారు. ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగరు.
పోరుబాట..
తమ హక్కుల కోసం కార్మికులు సమ్మెబాట పట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. వారి డిమాండ్లు తీర్చాల్సింది పోయి.. బెదిరించడం ఏంటి అని ప్రశ్నించరు. శ్రామికులు యూనియన్ పెట్టుకోవచ్చని, తమ సమస్యలపై పోరాటం చేయొచ్చని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. కార్మికులు ఏం తప్పు చేశారని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం బాధాకరమన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమని, కార్మికులకు హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
ఎమ్మార్పీఎస్ మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల గుండె ధైర్యాన్ని ప్రశంసించారు. ఐదున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ అంటే చాలా మంది భయపడుతున్నారని తెలిపారు. రాజకీయ నేతలు కూడా వణుకుతున్నారని.. కానీ మీరు కేసీఆర్ను ఢీ కొట్టి పోరాడుతున్నారని గుర్తుచేశారు.
జీతాలు ఇవ్వరా..?
ఆర్టీసీ కార్మికులు జీతాలు ఇవ్వకుండా వేధించడం సరికాదని బీజేపీ నేత వివేక్ విమర్శించారు. కార్మికుల్లో చీలిక తీసుకొచ్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నించారని ఆరోపించారు. కానీ మీరు ఒక్కటే, ఏకతాటిగా సమ్మె చేసి.. ఐక్యత ఏంటో నిరూపించారని కొనియాడారు. ఉద్యమకారులపై కేసులు పెట్టి అణగదొక్కడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని దుమ్మెత్తిపోశారు. కోదండరాం సహా మిగతా నేతలపై కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం వస్తే.. సీఎం సీటుపై కూర్చొని సబ్బండ వర్గాలను వేధిస్తున్నారని మండిపడ్డారు.
నయవంచన
తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి అందరినీ కేసీఆర్ మోసం చేశారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. ఆత్మగౌరవం కోసం తెలంగాణ అని చెప్పి.. కార్మికవర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బాగుపడుతుందని చెప్పి.. తమను నట్టేటలో ముంచారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను కూడా కేసీఆర్ సర్కార్ బేఖాతరు చేసిందని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల గత నెలరోజుల నుంచి జీతాలు లేవని.. కానీ తమ సమస్యల సాదనం కోసం ఇబ్బందులు తప్పవన్నారు. తమకు మద్దతు తెలిపిన రాజకీయ పక్షాలకు అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
డీజిల్పై వ్యాట్ ఎందుకు
బానిస సంకెళ్లు తెంచేందుకు పోరుబాట పట్టిన కార్మికులకు మద్దతుగా అండగా ఉంటామని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె దేనికి నిదర్శమని ప్రశ్నించారు. ఒక కుటుంబం ప్రయోజనం కోసమా..? స్వ రాష్ట్రం కోసం పోరాడింది అని గుర్తుచేశారు. ఆర్టీసీని విలీనం చేయాలంటే మేనిఫెస్టోలో లేదని కాకమ్మ కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. డీజిల్పై వ్యాట్ ఎందుకు ఎత్తివేయరని ప్రశ్నించారు.
విపక్షాల మద్దతు
సకల జనుల సమరభేరీ సభకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వ వైఖరి సరికాదని విమర్శించారు. ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ నేతలు వీహెచ్, రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి వివేక్, జితేందర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, టీడీపీ కమిటీ అధ్యక్షుడు రమణ, తీన్మార్ మల్లన్న వామపక్ష నేతలు తదితరులు మద్దతు తెలిపారు.