కేసీఆర్ ఇచ్చిన బహుమానామా? చేతివేలు తెగిన రంగారావు ఫైర్
టీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తలపెట్టిన తెలంగాణ బంద్ ఉద్రిక్తంగా మారుతున్నది. ఆరంభంలో శాంతియుతంగా ప్రారంభమైన బంద్.. పోలీసులు, రాజకీయ నేతల అత్యుత్సాహంతో ఆందోళనకరంగా మారింది. పలుచోట్ల హింసాత్మక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్ష నేతలను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావుకు తీవ్రగాయమైంది. జీప్ ఎక్కించే ప్రయత్నంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో రంగారావు చేతి బొటనవేలు తెగిపోయింది.
ఈ సందర్భంగా రంగారావు పోలీసులపై, ప్రభుత్వంపై తీవ్ర రంగారావు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు వ్యాన్లో ఎక్కించే క్రమంలో రెండు తలుపుల మధ్య వేలు పెట్టి ఉద్దేశపూర్వకంగానే నొక్కారు. దాంతోనే నా వేలు కట్ అయింది అని ఆయన ఆరోపించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వెలుగు చేస్తున్నాయి.
నన్ను చంపమన్నాడా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమనమా? అని పోలీసులను పోటు రంగారావు ప్రశ్నించారు. నిరంకుశత్వమా? చట్టాల మీద గౌరవం లేదు. తెలంగాణ కోసం కొట్లాడి జైలుకుపోయిన వాళ్లం. అందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన బహుమానామా? ఎంత దుర్మార్గమైందో మీరే చూస్తున్నారు అని రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమీప ఆస్పత్రిలో రంగారావు చికిత్స జరిగిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకొంటున్నారు.