ఎండీ లేకుండానే ఎలా.. ఆర్టీసీ బస్సు టెండర్లపై సవాల్.. హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ : ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో పాటు మరికొన్ని డిమాండ్లతో సమ్మె బాట పట్టారు కార్మికులు. ఆ క్రమంలో ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా డిపోల పరిధిలో కార్మికులు నిరసనలకు దిగుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ మేరకు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల టెండర్లపై మరో పిటిషన్ దాఖలు కావడం చర్చానీయాంశంగా మారింది.
ఆర్టీసీ బస్సుల టెండర్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్టీసీ కార్మిక సంఘ్ యూనియన్కు చెందిన కొందరు ప్రతినిధులు ఆ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శాశ్వత ప్రతిపాదికన మేనేజింగ్ డైరెక్టర్ లేకుండా టెండర్లు ఎలా పిలుస్తారనేది వారి వాదన. ఆర్టీసీలో బోర్డు సమావేశాలు నిర్వహించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ ఎండీ కొనసాగుతున్న తరుణంలో బస్సుల కోసం టెండర్లను పిలవడం చట్ట విరుద్దమని పిటిషనర్ల తరపు లాయర్ వాదించారు.
మా పొట్ట కొట్టొద్దు.. మద్దతు ఇవ్వండి.. ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
అదలావుంటే సమ్మె 18వ రోజుకు చేరినా.. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. సమ్మెపై ఎలాంటి విషయం తేల్చకుండా పర్మనెంట్ ప్రతిపాదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆర్టీసీ తరపున వాదించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి ఆన్సర్ ఇచ్చారు. హైకోర్టు ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకే ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత బస్సులు నడిపే పరిస్థితి లేదని వివరించారు. అదలావుంటే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇప్పటివరకు దాఖలైన పిటిషన్లపై ఈ నెల 28వ తేదీన మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది.