తెలంగాణ బంద్: పోలీసుల అత్యుత్సాహం.. వామపక్ష నేత తీవ్రగాయం.. బొటనవేలు తెగడంతో..
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రకటించిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేసేందుకు జేఏపీ, ఇతర రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నిస్తుండగా.. బంద్ ప్రభావం లేకుండా చేయాలన్న ప్లాన్తో పోలీసుల అండతో మరో వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ సందర్బంగా వామపక్ష నేతలు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా విమలక్క, చెరుకు సుధాకర్, తమ్మినేని వీరభద్రం, తదితర నేతలను అరెస్ట్ చేశారు.
తెలంగాణ బంద్ నేపథ్యంలో నేతలను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించగా గందరగోళం నెలకొన్నది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతికి గాయమైంది. రంగారావును బలవంతంగా పోలీస్ వ్యానులోకి ఎక్కించగా చేయి డోర్ మధ్యలో పడటంతో చేతి బొటనవేలు తెగి పోయింది. ఈ సందర్భంగా నేతలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. గాయపడిన రంగారావును వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన చేతికి కట్టుకట్టి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ప్రైవేట్ కార్యకర్తలను అడ్డుకొంటున్నారు. కొన్ని చోట్ల ప్రైవేట్ డ్రైవర్లపై దాడులు చేసిన సంఘటనలు నమోదయ్యాయి. బంద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులను భారీగా నియమించారు. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలతో పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీసాయి. జూబ్లీ బస్టాండ్ వద్ద ప్రొఫెసర్ కోదండరాంను, నారాయణ గూడలో చాడ, అజిజ్ పాషాను అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, ఆర్ రంగారావు చేతి బొటనవేలి తెగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. నిరసనకారులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సమంజసమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం శాంతియుతంగా ప్రారంభమైన తెలంగాణ బంద్ మధ్యాహ్నం కల్లా ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పే తీరు కనిపించడంతో ఎక్కడికక్కడే నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు.