ఆర్టీసీని నడపడం చేతకాదా.. నాకు అప్పగిస్తే లాభాలు చూపిస్తా : ప్రొఫెసర్ నాగేశ్వర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని నడపడం చేతగాకుంటే నాకు అప్పగించండి లాభాలు చూపిస్తానంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అంతేకాదు ఈ సవాల్ను కేసీఆర్ సర్కార్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. గురువారం నాడు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర వామపక్ష నేతలు చేపట్టిన సామూహిక దీక్షను ప్రారంభించిన నాగేశ్వర్ సమ్మెకు మద్దతు ప్రకటించారు.
డిజీల్పై 1300 కోట్ల ఖర్చు.. అందులో ప్రభుత్వానికి 300 కోట్ల పన్నులు
వామపక్ష నేతలు చేపట్టిన సామూహిక దీక్షను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్టీసీ సంస్థ ప్రతి సంవత్సరం డిజీల్పై 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో 300 కోట్ల రూపాయలను పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తోందని చెప్పుకొచ్చారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకున్నా ఏమి కాదు గానీ.. సంస్థకు వచ్చే ఆదాయంలో నుంచి కొంత తీసుకోవడం సరికాదన్నారు.
ఎన్టీఆర్ కంటే కేసీఆర్ గొప్ప మేధావా.. ఆనాడు ప్రభుత్వం కూలిపోలేదా : అశ్వత్థామ రెడ్డి
డిజీల్ ధరలను ప్రభుత్వమే భరిస్తే.. తమిళనాడులో అనుసరించినట్లుగా
ఆర్టీసీ నష్టాల బాటలో ఉన్నప్పుడు కూడా పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనంటూ ఆరోపించారు. ప్రైవేటు బస్సులకు అడ్డుకట్ట వేస్తే ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందని చెప్పుకొచ్చారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇక్కడ కూడా పాటించాలని డిమాండ్ చేశారు. అక్కడ డిజీల్ ధరలను ప్రభుత్వమే భరిస్తుందన్న నాగేశ్వర్.. అలా చేస్తే తెలంగాణ ఆర్టీసీకి కూడా నష్టాలు రావని సూచించారు.
సీఎం కేసీఆర్ పోకడ మంచిది కాదు.. తనకు ఎదురు లేదని విర్రవీగొద్దు : చాడా
ఇదే వేదిక మీద సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తనకు ఎదురు లేదనే తీరుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న పోకడ మంచిది కాదని హితవు పలికారు. ఐదుగురు కార్మికులు చనిపోయిన తర్వాత కూడా ఆర్టీసీ సమ్మెపై నోరు మెదపకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కనీసం మానవత్వం చూపించని కేసీఆర్ సీఎం పదవికి అనర్హుడని వ్యాఖ్యానించారు.
సమ్మెకు దిగారనే కోపంతో కార్మికులపై కేసీఆర్ కక్ష కట్టారని.. అందుకే దాన్ని నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారికి రాగద్వేషాలు ఉండకూడదని హితవు పలికారు. పదవిలోకి వచ్చే ముందు చేసిన ప్రమాణం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.
సీఎం రాకపాయే.. ఆర్టీసీ సమ్మెపై ఏం మాట్లాడకపాయే.. కేసీఆర్ సభకు వరుణిడి బ్రేక్..! మరి ఆనాడు..!!
కేసీఆర్ వైఖరితో ప్రమాదంలో ప్రజాస్వామ్యం : తమ్మినేని
ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రజానీకం మద్దతు కార్మిక వర్గానికే ఉందన్నారు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ వర్సెస్ తెలంగాణ సమాజం అనే విధంగా పరిస్థితి తయారైందని చెప్పుకొచ్చారు. ప్రజలు బస్సులు లేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ చోద్యం చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. సమ్మె న్యాయమైందనే విషయం పోలీసులు కూడా సమర్థిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ మొండి వైఖరి వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అభిప్రాయపడ్డారు. ఆయన తీరు వల్లే తెలంగాణలో చీకటి రోజులు వస్తున్నాయని మండిపడ్డారు.