TSRTC STRIKE: సకల జనుల సమర భేరీ సభ: కార్యాచరణ ప్రకటించనున్న అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మిక జేఏసీ తలపెట్టిన సకల జనుల సమరభేరీ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కార్మిక జేఏసీ కార్యాచరణను ప్రకటిస్తారు. ఆర్టీసీ జేఏసీ నేతలు థామస్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు తమ డిమాండ్లను ముందు ఉంచుతారు. సభకు వివిధ రాజకీయ పార్టీల అధినేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కార్మికులపై ప్రభుత్వ చర్యను ఎండగట్టేందుకు విపక్షాలు తమ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి.
TSRTC STRIKE:సమ్మె విరమించమని కార్మికులను ఆదేశించలేం, బకాయి వివరాలపై ఆరా, శుక్రవారానికి వాయిదా
ఆందోళన పర్వం
తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత 26 రోజులుగా ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, పీఆర్; ఐఆర్ సహా 26 డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు సూచనతో తొలి దఫా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల 21 డిమాండ్లను మాత్రమే నేరవేరుస్తామని యాజమాన్యం చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇటు కోర్టులో విచారణ కొనసాగుతుంది. దీంతోపాటు తమ వాణిని బలంగా వినిపించేందుకు కార్మిక నేతలు ఇవాళ సకల జనుల సమరభేరీ సభ తలపెట్టారు.
3 గంటలే సభ
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సకల జనుల సమరభేరీ సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. సభ పెట్టుకునేందుకు ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరూర్నగర్ స్టేడియంలో కాకుండా ఇండోర్ స్టేడియంలో పర్మిషన్ ఇచ్చారు. ఇందులో కేవలం 5 వేల మంది మాత్రమే కూర్చొనే వెసులుబాటు ఉంటుంది. జిల్లాల నుంచి వచ్చిన మిగతావారి కోసం స్టేడియం బయట భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
విపక్షాల మద్దతు
ఆర్టీసీ సకల జనుల సమరభేరీ సభకు ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు సభ దృష్ట్యా ప్రభుత్వం పోలీసులను కూడా భారీగా మొహరించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది. సమరభేరీ సభలో తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, కాంగ్రెస్ నేతలు వీహెచ్, రేవంత్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి.. ప్రభుత్వ దమననీతిని ఎండగడుతారు.
కార్యాచరణ ప్రకటన
సకల జనుల సమరభేరీ సభలో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 26 రోజులు గడుస్తోన్నందన.. డిమాండ్ల సాధన కోసం అవలంభించాల్సిన విధానంపై కార్మికులకు దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు సెప్టెంబర్ నెల వేతనం ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కార్మిక జేఏసీ నేతలు చెప్తున్నారు.