TSRTC STRIKE:సేవ్ ఆర్టీసీ పేరుతో బైక్ ర్యాలీ, 50వ రోజుకి చేరిన సమ్మె..
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 50వ రోజుకు చేరుకుంది. 26 డిమాండ్లపై కార్మికులు పట్టుబట్టారు. ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం ససేమిరా అనగా.. ఆర్టీసీ కార్మిక జేఏసీ మెట్టు దిగొచ్చింది. అక్టోబర్ 5వ తేదీకి ముందు లాగానే విధుల్లో చేరతామని కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ ప్రభుత్వం నంచి పిలుపురాకపోవడంతో ఏం చేయాలనే అంశంపై నేతలతో చర్చిస్తున్నారు.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ
సమ్మె @50వ రోజు
ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టి నేటికి యాభై రోజులవుతోంది. విలీనం, ఐఆర్, పీఆర్సీ తదతర 26 డిమాండ్లతో ఆందోళన బాటపట్టారు. సమ్మెకు వెళ్లే ముందు ఐఏఎస్ కమిటీ, సమ్మె చేపట్టాక ఆర్టీసీ ఇంచార్జీ ఎండీలతో చర్చలు జరిపారు. అయితే ఆర్థికభారం లేని డిమాండ్లకు మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. దీంతో చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.
ఆత్మహత్యలు..
ఆర్టీసీ సమ్మెతో 20 మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లు ఆసువులు బాసారు. డ్యూటీ లేక, జీతం రాక కార్మిక కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. దీంతో విలీనం అంశాన్ని పక్కన పెడుతున్నామని అశ్వత్ధామరెడ్డి పేర్కొన్నారు. విధుల్లో చేరతామని కూడా ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రావాల్సి ఉంది.
జోక్యం చేసుకోబోం
ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే అంశంలో తాము కల్పించుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో ప్రభుత్వానికి మరింత బూస్ట్ ఇచ్చినట్లైంది. ఆర్టీసీ సమ్మె, ప్రైవేట్ రూట్లు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దశలవారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. కానీ కార్మికులపై మాత్రం మొండి వైఖరి ప్రదర్శిస్తూనే ఉన్నారు.
బైక్ ర్యాలీలతో నిరసన
ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమవనున్నారు. డిమాండ్లపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే సమ్మెకు దిగి 50 రోజులవుతున్నా.. ప్రభుత్వం మొండి వైఖరిపై ప్రధానంగా డిస్కష్ చేస్తారు. మరోవైపు సేవ్ ఆర్టీసీ పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. గత 50 రోజులుగా ఏదో ఒక విధంగా నిరసన కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నారు.