TSRTC STRIKE:43వ రోజుకు చేరిన సమ్మె, సకల జనుల సమ్మె రికార్డ్ బ్రేక్,డిమాండ్లపై వెనక్కి తగ్గని జేఏసీ
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరింది. 26 డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని ఆర్టీసీ జేఏసీ భీష్మించుకొని కూర్చొంది. ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం ససేమిరా అనడంతో సమ్మె కొనసాగుతూ వస్తోంది. శనివారంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరింది. సకల జనుల సమ్మె సమయంలో కార్మికులు 42 రోజులు సమ్మె చేయగా.. ఆ రికార్డును ఆర్టీసీ కార్మికులే బ్రేక్ చేశారు.
డిమాండ్లపై వెనక్కి తగ్గం..
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తన ఇంట్లో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆర్టీసీ విలీనంపై వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. 26 డిమాండ్లలో ఏ ఒక్కటిపై రాజీపడబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వం మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు సడక్ బంద్, రైలు రోకో చేస్తామని తమ కార్యాచరణను ప్రకటించారు.
సమ్మె సైరన్..
26 డిమాండ్లను తీర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక జేఏసీ కార్పొరేషన్కు నోటీసులు ఇవ్వడంతో ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్లను తీర్చకుంటే అక్టోబర్ 5వ తేదీ నుంచి సమ్మె చేస్తామని అందులో స్పష్టంచేసింది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్లతో కూడిన కమిటీ వేసినా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. తర్వాత సీఎం కేసీఆర్ కమిటీని కూడా రద్దు చేశారు. ఇటు కార్మికులు తమ ఆందోళన పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
చర్చలు విఫలం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్, ఐఆర్ ఇవ్వాలనే 26 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఆర్టీసీ జేఏసీ ఉంచింది. హైకోర్టు స్పందనతో ప్రభుత్వం ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చల ప్రక్రియ చేపట్టింది. అయితే చర్చల్లో భాగంగా మొబల్స్ తీసుకెళ్లొద్దని, తదితర ఆంక్షలు విధించింది. అయినా కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న డిమాండ్లు కాకుండా 21 డిమాండ్లు నెరవేర్చేందుకు సిద్ధమని రవాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ పేర్కొన్నారు. తమ ప్రధాన డిమాండ్లు తీర్చమని కార్పొరేషన్ స్పష్టంచేయడంతో సమావేశం నుంచి యూనియన్ నేతలు బయటకొచ్చారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి.
కేసీఆర్ ఆదేశించారు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు కలుగజేైసుకొంది. కార్మికుల డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో సీఎం కేసీఆర్ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరాలని కూడా ఆహ్వానించారు. కానీ కేసీఆర్ పిలుపునకు కూడా కార్మికుల నుంచి స్పందన రాలేదు. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారిస్తోంది. ఆర్టీసీ యూనియన్, ప్రభుత్వానికి సూచనలు చేస్తోంది. సుప్రీం మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించాలని కూడా సూచించింది. మరోవైపు కార్మికుల జీతాల చెల్లింపుపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.
హైకోర్టులో చుక్కెదురు
మరోవైపు సీఎం కేసీఆర్ ఆర్టీసీలో 5100 బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిర్దేశిత సమయంలో రాకుంటే మరో 5100 బస్సులను కూడా ప్రైవేట్ వారికి అప్పగిస్తామని హెచ్చరించారు. కానీ సీఎం కేసీఆర్ ఆదేశాలను కార్మిక జేఏసీ లెక్కచేయలేదు. దానిని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు వేయడంతో కార్మికులకు అనుకూలంగా కోర్టు స్పందించింది.
ఆందోళన బాట
కార్మికులు మాత్రం తమ ఉద్యమ కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. డిపోల వద్ద ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీక్షలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా దీక్షలు కూడా చేపట్టారు. కార్మికులకు విపక్షాలు మద్దతు తెలిపాయి. మరోవైపు అక్టోబర్ 30వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆర్టీసీ కార్మికులు సమరభేరీ సభ నిర్వహించారు. విపక్ష నేతలంతా హాజరై తమ మద్దతును తెలిపారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ వైఖరిని ఎండగట్టారు. చలో ట్యాంక్బండ్కు కూడా విశేష స్పందన వచ్చింది. ప్రజాసంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ దమననీతిని ఎండగట్టారు.
Recommended Video
బలవన్మరణం
ఓ వైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగా.. కొందరు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చనిపోయారు. డ్యూటీ లేక, జీతం రాక ఇబ్బందిపడ్డారు. ఇప్పటివరకు 23 మందిడ్రైవర్లు, కండక్టర్లు చనిపోయారు. పెద్ద దిక్కును కోల్పోయి ఆయా కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. మరికొన్ని కుటుంబాలు పూట గడవక ఇబ్బందులు పడుతున్నాయి. ఆయా కుటుంబాలకు అండగా ఉంటామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చెబుతోంది. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ పట్టువిడాలని హైకోర్టు కూడా సూచిస్తోంది. కానీ ఇరువురు బెట్టుచేయడంతో సమ్మె కొనసాగుతోంది.