టీఎస్ఆర్టీసీ సమ్మె, విలీన డిమాండ్ నుండి వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ
ఆర్టీసీ సమ్మెపై కార్మికులు కీలక డిమాండ్ నుండి వెనక్కి తగ్గారు. గత నలబై రోజులుగా విలీనంపై పట్టుబడుతున్న కార్మిక నేతలు తాత్కలికంగా విలీన డిమాండ్ను పక్కనబెట్టారు. విలీనం డిమాండ్ సమ్మెను పక్కదారి పట్టిస్తుందని ...అందుకే ఆ అంశాన్ని పక్కనబెడుతున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వినర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఇప్పటికైనా... ప్రభుత్వం మిగిలిన అంశాలపై తమతో చర్చలు జరపాలని ఆయన కోరారు.
సమ్మె భవితవ్యంపై అఖిలపక్ష భేటి
ఆర్టీసీ సమ్మె భవితవ్యంపై చర్చించేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో పాటు అఖిలపక్ష పార్టీల నేతలు అంతకు ముందు సమావేశం అయ్యారు. విద్యానగర్లోని కార్యాలయంలో సమావేశానికి పలువురు పార్టీ నేతలతోపాటు ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి , తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, ఇతర కమ్యూనిస్టు పార్టీల నేతలు పాల్గోన్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులు చేపట్టిన సడక్ బంద్పై చర్చించారు..ఇందులో భాగంగానే విలీనం నిర్ణయం నుండి వెనక్కి తగ్గాలని నిర్ణయించారు.
సమ్మె కొనసాగుతోంది..
మరోవైపు సమ్మెలో భాగంగా చేపట్టిన పలు ఆందోళనలు కొనసాగుతాయని కార్మికులు స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యచరణలో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద నుండి ఆయా గ్రామాల్లోకి బైక్ ర్యాలీని చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం 16 వతేదిన సామూహిక దీక్షలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. 16 నుండి మూడు రోజుల పాటు సామూహిక దీక్షల్లో పాల్గోనాలని కోరారు. ఇక 19న చేపట్టిన సడక్ బంద్ సైతం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
విలీనం డిమాండ్ను ఒప్పుకోని సీఎం కేసీఆర్
ఆర్టీసీ విలీనం డిమాండ్ను సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకపోవడంతో పాటు కోర్టులో సైతం ఎలాంటీ పరిష్కారం లభించని పరిస్థితి నెలకొంది. మరోవైపు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. దీంతోపాటు హైకోర్టుకు సమస్యను పరిష్కరించే అవకాశాలు లేవని ...కార్మికుల సమస్యలతో కూడిన సమ్మె కాబట్టి... లేబర్ కమీషనర్కు కేసుసు బదీలీ చేయాలని ప్రభుత్వం కోరింది. ఒకవేళ కేసును లేబర్ కమీషనర్కు వెళ్లినా...లేక కోర్టుకు వెళ్లినా.... సమస్య పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉండడంతో కార్మికులే స్వయంగా విలీనం డిమాండ్ నుండి వెనక్కి తగ్గినట్టు సమాచారం.
ప్రభుత్వ స్పందనే తరువాయి...
విలీనం డిమాండ్ను ఆర్టీసీ కార్మికులు పక్కన పెట్టిన కార్మికులు సగం సమస్యను వారే పరిష్కరించినట్టైంది. కీలకమైన విలీనం డిమాండ్ను వాయిదా వేసుకోవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.. నలబై రోజులుగా కార్మికులు సమ్మె బాట పట్టినా... ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే పీకల్లోతూ కష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ... కార్మికుల సమస్యతో మరింత నష్టాల్లోకి వెళ్లిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో సంస్థ ప్రైవేటీకరణకే ఆయన మొగ్గు చూపారు. పలు రూట్లను ప్రైవేటికరించడంతో పాటు, ఆర్టీసీలో యాబై శాతం అద్దెబస్సులను తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం పలు సార్లు అధికారులతో చర్చలు జరిపి వాటి అమలుకు శ్రీకారం చుట్టారు. అయితే రూట్ల ప్రైవేటీకరణ అంశం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సమ్మెపై ఈనెల 11న తేల్చుతామని కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కార్మికులు విలీన డిమాండ్ నుండి వెనక్కి తగ్గడంతో సమస్య కొద్ది రోజుల్లోనే పరిష్కారం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి.