టీఎస్ఆర్టీసీ సమ్మె : చర్చలకు మరో డేట్... 28 డెడ్లైన్.. ఎవరు దిగివస్తారు...?
ఆర్టీసీ సమ్మెపై, యూనియన్లకు, మరియు ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. మూడు రోజుల్లో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చర్చల పూర్తి సారాంశాన్ని కోర్టుకు తెలపాలని కోరింది. ఇందుకోసం కేసును ఈనెల 28కి వాయిదా వేసింది. చర్చల కోసం గుర్తింపు పోందిన రెండు సంఘాలను ఆహ్వానించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం కార్మికులకు నమ్మకం కలిగే విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది.
ఆక్టోబర్ 28కి కేసు వాయిదా
ఈనేపథ్యంలోనే కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ యూనియన్లు పెట్టిన 45 డిమాండ్లలో 20 పరిష్కరించే విధంగా ఉన్నాయని తెలిపింది. గడిచిన రెండు రోజులుగా చర్చల్లో ఎలాంటీ పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన సూచనలతో ఏమాత్రం మార్పు రాకపోవడంతో మరోసారి కోర్టు ఇరువర్గాలకు అవకాశం ఇచ్చింది. మూడు రోజుల్లో చర్చలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళతామని జేఏసీ కన్వీనర్ అశ్వాథ్దామ రెడ్డి తెలిపారు. మరోవైపు రేపు తలపెట్టిన బంద్ యధావిధిగా కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం తన స్వంత మీడియా సంస్థద్వార సమ్మెను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి చురకలు అంటించిన కోర్టు
అంతకు ముందు ప్రభుత్వం వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలోనే కోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. సమ్మెను ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయిందంటూ..! రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. . ఆర్టీసీకి కొత్త ఎండీ నియామకంపై అడిగిన ప్రశ్నకు.. కొత్త ఎండీని నియమించడం వల్ల సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదని.. ఇప్పటికే అక్కడ సమర్థవంతమైన అధికారి ఇన్ఛార్జ్గా ఉన్నారనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఇప్పుడున్న అధికారి సమర్థుడైతే ఆయన్ని ఎండీగా ఎందుకు నియమించలేదని అడిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులనే విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించింది న్యాయస్థానం. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరని అర్థం వచ్చేలా ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మెకు మరికొంత మంది తోడై మద్దతు తెలిపితే సమ్మెను ఎవరూ ఆపలేరంటూ చురకలు అంటించింది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే...
కోర్టు ఆదేశాల తర్వాత ఇరువర్గాల్లో కూడ చర్చలపై మార్పు కనిపించలేదు. కోర్టు డైరక్షన్ పై ఇరువర్గాలు ఎవరి వాదనలు వారు వినిపించారు. అయితే కోర్టు సలహాల తర్వాత కూడ ఆర్టీసీ యూనియన్ నాయకులు మాత్రం సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన కార్యచరణ ప్రకారమే కొనసాగుతాయని చెప్పారు. 19న చేపట్టిన బంద్ కొనసాగుతుందని చెప్పారు. అయితే ప్రభుత్వం నుండి ఎలాంటీ స్పందన రాలేదు. కాని సమ్మెపై కోర్టు సలహా తర్వాత కూడ సీఎం కేసీఆర్ వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు కూడ అదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మె విరమించి చర్చలకు రావాలని ప్రభుత్వం చెబుతున్నా.. కార్మిక సంఘాలు మాత్రం ముందుకు రావడం లేదు. మరోవైపు ప్రభుత్వం కూడ సమ్మె విరమించే యత్నాలు మాత్రం చేయడం లేదు. దీంతో మరో రెండు మూడు రోజులు సమస్య ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.