ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి మొట్టికాయలు.. ఏజీ ఎక్కడ అంటూ హైకోర్టు ఆగ్రహం..!
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైకోర్టులో సోమవారం నాడు జరిగిన వాదనలు ఆసక్తికరంగా మారాయి. సుదీర్ఘ వాదనలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు తప్పలేదు. అడ్వకేట్ జనరల్ ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించిన నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సమ్మె నేపథ్యంలో బస్సులు సరిగా నడవక ఓ చిన్నారి చనిపోతే బాధ్యత ఎవరిదంటూ నిలదీసింది. ఆ క్రమంలో తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. అయితే బుధవారం నాటికి గడువు ఇవ్వాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోరడంతో తోసిపుచ్చింది న్యాయస్థానం.
ఆర్టీసీ సమ్మె.. హైకోర్టులో సుదీర్ఘ వాదనలు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం నాడు హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆర్టీసీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ వాదించగా.. పిటిషనర్ల తరపున న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోసారి వాదనలు వినేందుకు మంగళవారం నాటికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మరోసారి విచారణ జరుపుతామని పేర్కొంది. అయితే బుధవారం వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపున కోరినప్పటికీ.. హైకోర్టు అంగీకరించలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరును ఈ సందర్భంగా గుర్తు చేసిన న్యాయస్థానం మరోసారి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. మహిళా కండక్టర్ ఆత్మహత్య.. తాత్కాలిక సిబ్బందితో పరేషాన్..!
ఆర్టీసీ కార్మికులు మొండిగా ఉన్నారంటూ ఏఏజీ వాదనలు
ఆర్టీసీ తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ కొన్ని విషయాలు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వంతో చర్చలు జరిపే విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని చెప్పుకొచ్చారు. కార్మికులు ప్రధానంగా అడుగుతున్న 21 డిమాండ్లలో రెండు మాత్రమే సంస్థ భరించే విధంగా ఉన్నాయని.. మిగతా 16 డిమాండ్లు చూసినట్లయితే సంస్థపై ఆర్థిక భారం పడనుందని వివరించారు. ఆ మేరకు చర్చల వివరాలతో కూడిన అడిషనల్ కౌంటర్ దాఖలు చేశారు. ఇక మరో రెండు డిమాండ్లు ఐతే అసలు పరిగణనలోకి తీసుకునే విధంగా లేవని వెల్లడించారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా 175 కోట్ల నష్టమంటూ..!
ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని మరోసారి వాదించారు అదనపు అడ్వకేట్ జనరల్. ఇదివరకే ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే సమ్మె కారణంగా సంస్థకు 175 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని.. ఆర్టీసీ దగ్గర ప్రస్తుతం 10 కోట్ల రూపాయల నగదు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో హైకోర్టు ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఒకవేళ సమ్మె విరుద్ధమైతే కార్మికులపై ఆర్టీసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కోరింది. దాంతో ఏఏజీ ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో సంతృప్తి చెందని హైకోర్టు కార్మికుల సమస్యలపై ఆర్టీసీ సంస్థదే తప్పన్నట్లుగా వ్యాఖ్యానించింది.
తెలంగాణలో ప్రజా రవాణా సంస్థదే కీ రోల్ అంటూ..!
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రస్తావించింది హైకోర్టు. తెలంగాణలో చూసినట్లయితే రైళ్ల కంటే బస్సులపైనే జనాలు ఎక్కువగా ఆధారపడతారనే విషయం గుర్తు చేసింది. ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో, అటవీ ప్రాంతాల్లో చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి ఉంటుందని.. ఆ క్రమంలో ఆర్టీసీ బస్సులపైనే ప్రధానంగా ఆధారపడతారని పేర్కొంది. ఈ క్రమంలో బస్సులు సరిగా లేక ఎవరైనా మరణిస్తే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించింది. డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో 46 కోట్ల రూపాయలు లేవనే సాకుతో ఆర్టీసీ సమ్మెను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా చనిపోతే పరిస్థితి ఏంటని నిలదీసింది.
పొదుపు మాట దేవుడెరుగు.. కొంప ముంచిన గోల్డ్ స్కీమ్..!
ఏజీ ఎక్కడ అంటూ హైకోర్టు ఆగ్రహం..!
బస్సుల మరమ్మతుల విషయంలో కూడా ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. టూల్స్, స్పేర్ పార్ట్స్కు సంబంధించి బడ్జెట్ ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించింది హైకోర్టు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించేలా ప్రవర్తించాలని సూచించింది. కార్మికుల డిమాండ్లు సాధ్యం కావని ఆర్టీసీ ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చిందన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.
అదలావుంటే వాదనలు వినిపిస్తున్న క్రమంలో అదనపు అడ్వకేట్ జనరల్పై హైకోర్టు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ తరపున వాదనలు వినిపించడానికి అడ్వకేట్ జనరల్ మాత్రమే రావాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో న్యాయమూర్తి ఆదేశాలు పాటించి అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు చేరుకుని వాదనలు వినిపించడం కొసమెరుపు.