TSRTC STRIKE:ఆర్టీసీకి రూ.1099 కోట్ల బకాయి, అంగీకరించిన ఏజీ, నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
టీఎస్ఆర్టీసీకి యాజమాన్యం బకాయిలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆర్టీసీకి రూ.1099 కోట్లు బకాయి ఉన్నట్టు మేనేజ్మెంట్ అంగీకరిచింది. అయితే అందులో తమ వాటా 48 శాతం అని మెలికపెట్టింది. 52 శాతం బకాయిలను ఏపీ ప్రభుత్వం చెల్లించాలని వాదనలు వినిపిస్తోంది. ఆర్టీసీ అధికారుల తీరుపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహాం వ్యక్తం చేసింది. వాస్తవాలను మరుగునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ఆర్టీసీ బకాయిలకు సంబంధించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించింది.
బకాయిలపై ఆరా..
ఆర్టీసీ సమ్మె 25వ రోజు చేరుకొన్న క్రమంలో సమ్మె.. మరోవైపు ఆర్టీసీ బకాయిలపై కూడా హైకోర్టులో విచారణ జరుగుతుంది. బకాయిలకు సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆర్టీసీకి ప్రభుత్వం రూ.1099 కోట్లు బకాయి ఉన్న మాట వాస్తవమేనని అడ్వకేట్ జనలర్ అంగీకరించారు. కానీ అందులో తమ వాటా 48 శాతమేనని స్పష్టంచేశారు. మిగిలిన 52 శాతం బకాయి ఏపీ ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం కలుగజేసుకొంది. ఆర్టీసీ ఆస్తులు ఇంతవరకు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించింది.
కేంద్రం పరిధిలో అంశం..
ఆర్టీసీ విభజన తెలుగు రాష్ట్రాల పరిధిలోని అంశం కాదని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ విభజన కేంద్రం పరిధిలో ఉన్న అంశమని తెలిపారు. ఆర్టీసీ బకాయిలకు సంబంధించిన అంశంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరు సరిగాలేదని మండిపడింది. వాస్తవాలను మరుగున పడేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. బకాయిలకు సంబంధించిన వివరాలను అందజేయాలని ఆదేశించింది. రూ.1099 కోట్లకు సంబంధించి రాయితీల వివరాలు పూర్తిస్థాయిలో నివేదిక అందజేయాలని తేల్చిచెప్పింది.
ఎవరి వాదనలు వారివే..
హైకోర్టులో ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపిస్తుండగా.. ఆర్టీసీ కార్మికుల తరఫున ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఆర్టీసీ బకాయిల భారం సంస్థపై పడిందని ఉద్యోగులు చెప్తున్నారు. రూ.5 వేల కోట్ల అప్పుల్లో వెయ్యి కోట్లు తగ్గితే కాస్త భారం తగ్గుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. బకాయిలకు సంబంధించి ప్రభుత్వం, ఆర్టీసీ వాదనలు కొనసాగుతున్నాయి.
డిమాండ్లపై పట్టు
ఆర్టీసీ సమ్మె 25 రోజులుగా కొనసాగుతోంది. 26 డిమాండ్లు తీర్చాలని కార్మిక నేతుల, 21 డిమాండ్లకు ఓకే అని యాజమాన్యం చెప్పడంతో తొలి దఫా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ్టి హైకోర్టు విచారణతో ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఏం సూచనలిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం, కార్మిక నేతలు పట్టు, విడుపు ఉండాలని మేధావులు, ప్రజాసంఘాల నేతలు సూచిస్తున్నారు.