ఆర్టీసీ సమ్మె ఉధృతం.. మహిళా కండక్టర్ ఆత్మహత్య.. తాత్కాలిక సిబ్బందితో పరేషాన్..!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరింది. అయితే ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఏం జరగబోతోందనే విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఆ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం చర్చానీయాంశమైంది. అదలావుంటే తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ అధికారులకు తలనొప్పులు తప్పడం లేదు. ప్రతి నిత్యం ఏదో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం నాడు హైదరాబాద్ తార్నాక ప్రాంతంలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది.
ఆర్టీసీ సమ్మె 24వ రోజు.. కార్మికుల ఆందోళన
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరిన దరిమిలా రోజుకో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అదే క్రమంలో ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని చెబుతున్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి మంచిది కాదని సూచిస్తున్నారు. అదలావుంటే 24 రోజులుగా సమ్మె కొనసాగుతుండటం.. ప్రభుత్వం మెట్టు దిగిరాకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. గత నెల జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు.
సమ్మెపై ఏటూ తేలక.. మహిళా కండక్టర్ ఆత్మహత్య
ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారడంతో ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్తుపల్లి డిపోకు చెందిన మహిళా కండక్టర్ కె.నీరజ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకుని ప్రాణాలు విడిచారు. సమ్మెపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కలత చెంది సూసైడ్ చేసుకున్నట్లు ఖమ్మం రీజియన్ ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ గడ్డం లింగమూర్తి వెల్లడించారు. ఆమె ఆత్మహత్యతో స్థానికంగా విషాదం నెలకొంది. సహచర ఉద్యోగులు కన్నీటి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు సమాచారం.
ఇద్దరి ప్రియులతో క్లోజ్.. తల్లి మందలించిందని హత్య.. ఆపై రాసలీలలు..!
హబ్సీగూడలో బస్సు బీభత్సం.. 3 కార్లు, ఒక బైక్ ధ్వంసం
అదలావుంటే తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ ఉన్నతాధికారులు బేజారవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలో సోమవారం (28.10.2019) నాడు ఉదయం సికింద్రాబాద్లోని తార్నాక ప్రాంతంలో ఓ బస్సు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు.
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి జనగామకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు హబ్సీగూడ చౌరస్తాకు రాగానే ప్రమాదం జరిగింది. బస్సును అదుపు చేయలేని తాత్కాలిక డ్రైవర్ ముందున్న వాహనాలను ఢీకొడుతూ ముందుకెళ్లాడు. దాంతో మూడు కార్లు, ఒక బైక్ ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. అయితే బస్సులో ఉన్న 8 మంది ప్రయాణీకులు మాత్రం సేఫ్గా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సదరు డ్రైవర్ పారిపోయాడు.
వరుస ప్రమాదాలతో పరేషాన్.. ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల యాక్సిడెంట్లు
ఖమ్మం జిల్లాలో తాత్కాలిక డ్రైవర్ కారణంగా మరో ప్రమాదం జరిగింది. భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్రోడ్డులో ప్రమాదానికి గురయింది. భద్రాచలం నుంచి హైదరాబాద్కు వెళుతున్న క్రమంలో అదుపు తప్పింది. దాంతో రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 13 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారందరికీ గాయాలయ్యాయి. అదలావుంటే సత్తుపల్లి డిపోకు చెందిన మరో బస్సు కూడా ఇలాగే ప్రమాదానికి గురయింది. తాత్కాలిక డ్రైవర్పై తీవ్రంగా మండిపడ్డ ప్రయాణీకులు చివరకు సహనం కోల్పోయి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.