రవిప్రకాశ్ను కస్టడీకి ఇస్తే కీలక ఆధారాలు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..!
హైదరాబాద్ : టీవీ9 యజమాన్యాన్ని మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ను పది రోజుల కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును మంగళవారం (15.10.2019) నాటికి వాయిదా వేసింది న్యాయస్థానం. టీవీ9 యజమాన్యానికి తెలియకుండా రవిప్రకాశ్ 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసుకున్నారని.. ఈ కేసులో అతడిని కస్టడీకి అప్పగిస్తే కీలక ఆధారాలు బయటకొస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
ఈ కేసులో భాగంగా రవిప్రకాశ్ను విచారించడానికి పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ రవిప్రకాశ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్, ఎక్స్గ్రేషియా తదితర బెనిఫిట్లను దొడ్డిదారిన దారి మళ్లించారని.. పూర్తి ఆధారాలు పోలీసులకు ఇవ్వడం జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
నాడు - నేడు : కార్మికులకు సపోర్ట్.. ప్రభుత్వానికి వత్తాసు.. ఇదేందీ మంత్రి గారు..!
రవిప్రకాశ్ సొమ్ము డ్రా చేసుకున్న సమాచారానికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆధారాలు అన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. అయితే రవిప్రకాశ్పై ఎన్సీఎల్టీ, హైకోర్టులో ఉన్న కేసులకు.. ఈ కేసుకు సంబంధం లేదని వివరించారు. కంపెనీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి బోర్డు మీటింగులు పెట్టకుండా.. అధిక షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా రవిప్రకాశ్ 18 కోట్ల రూపాయల సొమ్ము అక్రమ మార్గాల్లో డ్రా చేసుకున్నారని కోర్టుకు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఏ-1 ముద్దాయిగా రవిప్రకాశ్ ఉండగా.. టీవీ9 ఆర్థిక వ్యవహారాలు చూసిన మూర్తి ఏ-2 ముద్దాయిగా ఉన్నారు. అయితే మూర్తి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అక్రమంగా డ్రా చేసిన 18 కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించారనే విషయంలో విచారించాల్సి ఉందని.. ఆ క్రమంలో పది రోజుల పాటు కస్టడీకి ఇస్తే నిజాలు బయటకు వస్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.